సాధికార శంఖారావం

Vardelli Murali Article On AP Disha ACT 2019 - Sakshi

జనతంత్రం

ఈ డిసెంబర్‌ నెల ఎందుకో కొంచెం స్పెషల్‌గా కనిపిస్తున్నది. వణికించే చలిగాలులు ఇంతవరకూ వీచిన దాఖలా లేదు. ఈసారి డిసెంబర్‌ మాసం రైతుల పాలిటి కరుణామయి లాగా కనిపిస్తున్నది. కల్లాల్లోని ఖరీఫ్‌ను–నాటేసుకుంటున్న రబీని కబళించే తుపాను దాడులకు తావీయలేదు. శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం నడుస్తున్న ఈ డిసెంబర్‌ నెల మహిమాన్వితమైన మాసంగా ఉత్తేజపరుస్తున్నది. సాధికారత కోసం, సమాన హక్కులకోసం స్వప్నిస్తున్న మహిళలకు, పేద వర్గాలకూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ఖడ్గాలనూ, రక్షణ కవచాలను అంద జేసింది. శాసనసభ శీతాకాల సమావేశాలు ఒక విప్లవాత్మక బిల్లును ఆమోదించాయి.

మరో విప్ల వాత్మక ప్రస్థానానికి అడ్డుగా నిలిచిన ముళ్లనూ, రాళ్లనూ ఏరివేశాయి. ఈ నేలనూ నింగినీ ఏలడా నికి ముందుకొస్తున్న మహిళల పాలిటి తోడేళ్లుగా దాపురించిన మృగాళ్లను గురి తప్పకుండా వేటాడే ఏపీ–దిశ చట్టాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపొందించి సభ ఆమోదాన్ని తీసుకున్నది. పోటీ ప్రపం చంలో నెగ్గుకు రావడానికి ఒక దివ్యాస్త్రంలాగా ఉపయోగపడుతున్న అంశం ఇంగ్లిష్‌ మాధ్య మంలో విద్యాబోధన. ఆ దివ్యాస్త్రాన్ని పేద విద్యా ర్థులందరికీ ప్రసాదించడం కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిర్మించాలని ఉవ్విళ్లూరిన ప్రతిపక్షం ప్రజా చైతన్యాన్ని చూసి వెనక డుగు వేసింది. ఈ అసెంబ్లీ చర్చల్లో ఇంగ్లిష్‌ మాధ్య మంపై తెల్లజెండా చూపించి సంపూర్ణమైన లొంగు బాటును బేషరతుగా ప్రకటించింది.

మహిళల విద్యపై అప్రకటిత నిషేధం కొన సాగుతున్న రోజుల్లోనే, నూరేళ్లకు పూర్వం.. ‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్‌’ అని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ప్రశ్నిం చారు. నాటినుంచి నేటివరకు విద్యా– విజ్ఞాన రంగాల్లో మహిళల ప్రస్థానం జెట్‌ వేగంతో దూసు కొని వచ్చింది. ఎన్నోవిధాలుగా సామాజిక శృంఖ లాలలో బంధించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె జైత్రయాత్రను సంపూర్ణంగా అడ్డుకోలేక పోయారు. రైలింజన్లూ, యుద్ధ విమానాలు నడప డంతోపాటు అంతరిక్షయానం దాకా ఆకాశమే హద్దుగా పురోగమిస్తున్నది. ఈ దశలో, ప్రత్యేకించి మనదేశంలో నెలకొన్న దురదృష్టకర పరిస్థితి మహిళా సాధికారతకు ఆటంకాలు సృష్టిస్తున్నది. మహిళలపై జరుగుతున్న హింసా,  అత్యాచారాలు మనదేశంలోనే ఎక్కువ. రెండేళ్ల కిందటి అధికారిక లెక్కల ప్రకారమే సగటున రోజుకు 90 అత్యా చారాలు జరుగుతున్నాయి. ఇది పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు అవుతున్న కేసుల సంఖ్య మాత్రమే. ఫిర్యాదు చేయకుండా తమలో తాము కుమిలి పోతున్న వారి సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. చదువుకునే చోట, పనిచేసే ఆఫీసులో, ఇంట్లో–ఇరుగుపొరుగులో, బంధు వర్గాల మధ్య, వీధుల్లో పోకిరీల నడుమ వేధిం పులు, వెక్కిరింతలతో మానసిక వేదనకు గురికాని మహిళల సంఖ్య బహు స్వల్పం.

స్త్రీని సహచరిగా కాక, తక్కువగా చూసే మన సాంస్కృతిక వార సత్వ భావజాలం కారణంగా కొందరి మెదళ్లలో ‘మృగాళ్లు’ మొలుస్తున్నాయి. అలా మొలకెత్తిన మృగాళ్లకు కడుపునిండా మద్యంపోసి, కంటినిండా అశ్లీలం పోసి ఏపుగా పెంచుతున్నాము. అలా పెరి గిన తోడేళ్లు మానవ రూపం కప్పుకొని యథేచ్ఛగా మహిళలపై దాడులు చేయగలుగుతున్నాయి. గజా నికొక గాంధారీసుతుడు గాండ్రిస్తున్న నేలలో, విచ్చలవిడిగా కీచక సంతతి రెచ్చిపోతున్న వేళలో నిర్భీతిగా సంచరించే స్వేచ్ఛను మహిళ కోల్పోతు న్నది. ఆ స్వేచ్ఛ లేనినాడు మరిన్ని ఉన్నత శిఖరా లను అధిరోహించడం మహిళకు సాధ్యంకాదు. ఒక రకంగా మహిళా సాధికారతకు ఈ కీచక పర్వం ఆటంకంగా తయారైంది. తన పతి ప్రాణాలను అన్యాయంగా హరించారన్న కోపంతో యమ ధర్మరాజును నిలదీయడానికి బయల్దేరుతుంది సావిత్రి. యమపురిలోకి ప్రవేశించడానికి అడ్డుగా భయంకరమైన వైతరణీ నది ప్రవహిస్తుంటుంది.

సావిత్రి తన లక్ష్యాన్ని సాధించి పతిప్రాణాలను తిరిగి పొందాలంటే ఈ వైతరణీ సవాల్‌ను అధిగ మించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేటి మహిళ తన సాధికారతా లక్ష్యసాధన కోసం అత్యాచారాల రూపంలో జుగుప్సాకరంగా ప్రవహిస్తున్న వైతర ణిని దాటవలసి వున్నది. అదిగో, అలా దాట డానికి ఉపయోగపడే ఒక పడవను ఏపీ దిశ యాక్ట్‌ –2019 రూపంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తయారు చేసింది. గతంలో ఇందుకోసమే కేంద్రం రూపొందించిన నిర్భయ చట్టం ఆచరణలో సత్ఫ లితాలు ఇవ్వని నేపథ్యంలో అందులోని లోపాలను పరిహరిస్తూ, కట్టుదిట్టంగా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలాగా ఈ బిల్లును ఏపీ ప్రభుత్వం తయారుచేసింది. యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన శంషాబాద్‌ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వెటర్నరీ డాక్టర్‌ ‘దిశ’ పేరు మీద ఏపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. దుర్మార్గాలకు బలవుతున్న ఆడబిడ్డల పట్ల ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆలోచించి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఇది అమలులోకి వచ్చిన తర్వాత అత్యాచారం ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలని ఆయన హెచ్చరించారు. దిశ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో ఏడు పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి. మరో 14 పని దినాల్లో కోర్టు విచారణ పూర్తికావాలి. దోషం నిరూపితమైతే తప్పనిసరిగా మరణదండనే. ఇందుకోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో కొత్తగా 354 (ఎఫ్‌) సెక్షన్‌ను చేర్చారు. అదేవిధంగా సోషల్‌ మీడియా వేదిక ద్వారా మహిళలపై జరిగే వేధింపులపై కూడా కఠిన శిక్షలను ప్రతిపాదిస్తూ 354 (ఇ) సెక్షన్‌ను జోడించారు. ఈరకంగా ప్రతి పాదించిన సత్వర న్యాయం పూర్తిగా ఆచరణా త్మకం కావడానికి కూడా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇందుకోసం మరొక బిల్లును ప్రత్యే కంగా శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాల కేసులు విచారించడానికి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటవుతుంది. ఈ కేసులు వేగంగా దర్యాప్తు చేయడానికి వీలుగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేస్తారు. వీటికోసమే ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమిస్తారు.

స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు ఐపీసీలో సవరణలు చేసుకునే సౌకర్యం రాష్ట్రాలకు ఉన్నందువలన ఏపీ దిశ–2019 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంలో ఎటువంటి ఇబ్బంది వుండే అవకాశం లేదు. బిల్లుకు ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. మహిళా హక్కుల ఉద్యమ కారుల దగ్గర నుంచి సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, పార్లమెంట్‌ సభ్యులు, విద్యార్థులు, యువతులు స్వాగతించారు. ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిం చారు. ఏపీ దిశ చట్టాన్ని దేశమంతటా అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌ ప్రధానమంత్రికి లేఖ రాశారు. నిర్భయ తల్లి, దిశ తండ్రి రాష్ట్ర ప్రభుత్వ చర్యను కొనియాడారు. భారతదేశ మహిళా సాధి కారిత ఉద్యమ చరిత్రలో ఏపీ–దిశ యాక్ట్‌–2019 ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రిజర్వు చేసుకున్నది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై కూడా సభలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసివున్నప్పటికీ మరోసారి చర్చ జరగడానికి కారణం వున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే తడవుగా ప్రతిపక్ష క్యాంపు దీనికి వ్యతి రేకంగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించేటందుకు సన్నాహాలు చేసింది. తెలుగు భాషకు మరణ శాసనం రాస్తున్నారంటూ చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌లు విరుచుకుపడ్డారు. ఎల్లో మీడియాగా చలామణిలో వున్న రెండు పత్రికలు పతాక శీర్షిక లతో కృత్రిమ ఉద్యమానికి సమిధలు సమకూ ర్చాయి. ఈ వ్యవహారంపై పేద ప్రజానీకంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రైవేట్‌ పాఠ శాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న ధన వంతుల బిడ్డలతో తెలుగు మాధ్యమంలో చదువు కున్న తమ బిడ్డలు పోటీ పడలేకపోవడాన్ని ఈ తల్లిదండ్రులు అనుభవపూర్వకంగా తెలుసుకు న్నారు. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకుండా పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నెగ్గుకు రావడం కష్టం. తెలుగులో చదివిన విద్యార్థి ఉన్నత స్థానాలను చేరుకోవడానికి ఇది పెద్ద అవరోధంగా తయారైంది. అసమానుల మధ్య పోటీ ధర్మంకాదు, యుద్ధనీతి కూడా కాదు. విరథిపై రథి బాణం వేయడు. తన రథ చక్రం నేలలో దిగబడినప్పుడు కిందికి దిగి చక్రాన్ని పైకె త్తడానికి ప్రయత్నిస్తాడు కర్ణుడు. ఇదే అదనుగా బాణం ఎక్కుపెట్టిన అర్జునుడికి ఈ ధర్మాన్ని గుర్తుచేస్తాడు కర్ణుడు.

బ్రాహ్మణేతరులకు తిరు మంత్రోపదేశం నిషి ద్ధమైన రోజులలో శ్రీరంగం గుడి గోపురమెక్కి అందరికీ వినిపించేలా గట్టిగా ఆ మంత్రాన్ని పఠించిన రామానుజాచార్యుల వారి విప్లవాత్మక చర్య వంటిది పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధన. పేదల సాధికారతకోసం ప్రభుత్వం సమ కూర్చిన దివ్యాస్త్రంగా ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని వారు భావించారు. తెలుగు భాషాభిమానం పేరుతో ముందుకు తెచ్చిన మోసపూరిత వాదాలను పేద వర్గాల అనుకూల మేధావులు ప్రతి వాదాలతో తుత్తునియలు చేసి ప్రభుత్వానికి అండగా నిలి చారు. ఈ పరిణామాలతో బిత్తరపోయిన ఎల్లో సిండికేట్‌ తోకముడిచింది. ఈ సమావేశాల్లోనే ప్రతిపక్ష నేత తన అమ్ముల పొదిలోని యూ–టర్న్‌ బాణాన్ని మరోసారి ప్రయోగించాడు. తన ఖాతాలో ఇదివరకే వేసుకున్న హైదరాబాద్‌ నిర్మాణం, కంప్యూటర్‌ను కనిపెట్టడం, మొబైల్‌ ఫోన్‌ ఇన్వెన్షన్‌ వగైరాల సరసన ఇంగ్లిష్‌ మీడి యాన్ని కూడా చేర్చుకున్నారు.

స్వల్పకాలిక సమావేశాలే అయినప్పటికీ, పేదలు, మహిళల తరఫున సాధికార శంఖారావం చేసిన సమావేశాలుగా ఇవి అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోతాయి. చరిత్రాత్మకమైన దిశ బిల్లును అడ్డుకోవడానికీ, ఇతర ముఖ్యమైన బిల్లులను పక్క దోవ పట్టించడానికి వాయిదా తీర్మానాలు పెట్ట డం, మార్షల్స్‌తో గొడవపడడం వగైరా పాత టెక్ని క్‌లనే ప్రతిపక్షం ఆశ్రయించింది. ఈ తరహా ‘ప్లే టు ది గ్యాలరీ’ వ్యూహాలకు కాలదోషం పట్టింది. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారు. తన వయసు డెబ్బయ్‌ సంవత్సరాలైనా, ఆలోచన ఇరవైరెండేనని ప్రతిపక్ష నేత ప్రకటించుకున్నారు. ఆ మాటలు ఆచరణాత్మకంగా నిరూపితం కావా లంటే అసెంబ్లీలో పాతకాలపు వీధినాటక ప్రద ర్శనలకు భరతవాక్యం చెప్పవలసి ఉంటుంది.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top