సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎల్లుండి.. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎల్లుండి.. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటలతో ప్రచారపర్వం ముగుస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ, 17లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. తెలంగాణలోని 8 లోక్సభ, 31 అసెంబ్లీ స్థానాల్లో రెండేసి ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఇప్పటికే 75 శాతం మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. 90 శాతం పోలింగ్ జరగడమే లక్ష్యంగా ఈసీ ప్రణాళిక సిద్ధం చేసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.
17 లోక్సభ స్థానాల్లో 265 మంది పోటీ చేస్తుండగా, 119 అసెంబ్లీ స్థానాల్లో 1669 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 2,81,66,266 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు మూసివేయాలని, బల్క్ ఎస్ఎంఎస్లు పంపరాదని నిషేధం విధించారు.