లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు.
విజయవాడ: లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. అందుకే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడకు వచ్చిన వెంకయ్య నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు .
విజయం సాధిస్తామనే నమ్మకం కాంగ్రెస్ నాయకులకు లేదని, కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ బహిరంగ వ్యాఖ్యలే నిదర్శనమని వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయం వల్లే నైతిక విలువలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని అన్నారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.