రాష్ట్ర పురోగతికి వరం లాంటి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో ప్రజలు మరోసారి దగా పడ్డారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాల కపట నాటకానికి తెరపడి, జైట్లీ ప్రకటన తో అసలు రంగు బయటపడడంతో జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెండున్నరేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నట్టు మభ్యపెట్టిన చంద్రబాబు తీరుపై కన్నెర్రజేస్తున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం గుప్పెట్లో కీలుబొమ్మగా మ
దగాపై కదనభేరి
Sep 8 2016 11:52 PM | Updated on Mar 23 2019 9:10 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
రాష్ట్ర పురోగతికి వరం లాంటి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో ప్రజలు మరోసారి దగా పడ్డారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాల కపట నాటకానికి తెరపడి, జైట్లీ ప్రకటన తో అసలు రంగు బయటపడడంతో జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెండున్నరేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నట్టు మభ్యపెట్టిన చంద్రబాబు తీరుపై కన్నెర్రజేస్తున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం గుప్పెట్లో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు ఇక ప్రత్యేక హోదా తేలేరన్న వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సమైక్యాంధ్ర ఉద్యమ స్థాయిలో మరో పోరుకు సమాయత్తమవుతున్నారు. ఒకప్పుడు సొంతమామను వెన్నుపోటుపొడిచిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను కూడా అదే తరహాలో వంచించారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధిపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు సహా అన్ని వర్గాలూ చంద్రబాబు తీరును జీర్ణించుకోలేకపోతున్నాయి.
పోరుబాటలో జగన్
ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచీ పోరాడుతూనే ఉన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ రెండేళ్లుగా ఢిల్లీలో, రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. జనం ఆకాంక్షల మేరకు మరో ఉద్యమానికి సన్నద్ధమౌతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న రాష్ట్రవ్యాప్త బంద్కు జగన్ పిలుపునిచ్చారు. కలిసి వచ్చే అన్నివర్గాలనూ సమన్వయం చేసుకుంటూ బంద్ను విజయవంతం చేయడంతోపాటు తదుపరి కార్యాచరణకు కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.
హోదా లేకుంటే జిల్లాకు అపారనష్టం
ప్రత్యేక హోదా లేకుంటే అపార సహజవనరులు కలిగి, రేవు కార్యకలాపాలు, రైల్వే రవాణా, అనేక పరిశ్రమల ద్వారా ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధిస్తున్న జిల్లాకు తీవ్రనష్టమే. ఇప్పటికే ప్రభుత్వపరమైన ప్రోత్సాహం, రాయితీలు లేకపోవడంతో నత్తనడకన జరుగుతున్న అభివృద్ధి ప్రస్తుత పరిస్థితుల వల్ల మరింత కుంటుపడే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఎస్ఈజడ్ ద్వారా ఎన్నో పరిశ్రమలు వస్తాయన్న ఆశ కూడా అడుగంటిపోయే పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్న ఆశకూడా అడియాసే అన్న భావన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. కేజీ బేసిన్లో అపార చమురు నిక్షేపాలున్నందున ఇక్కడ పెట్రోలియం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ఇప్పుడు అవి కూడా రాని పరిస్థితి ఉందంటున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే రాయితీలు అవసరం. హోదాతోనే ఇవి సాధ్యమవుతాయి. ప్రత్యేక హోదాతో రాయితీలతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వచ్చి తామూ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కుతాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
Advertisement


