వైఎస్ఆర్ జిల్లాలోని రాయచోటి, జమ్మలమడుగు, బద్వేల్ మున్సిపాలిటీల్లో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ జిల్లాలోని రాయచోటి, జమ్మలమడుగు, బద్వేల్ మున్సిపాలిటీల్లో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ రమేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, జమ్మలమడుగులో 2వ వార్డు కౌన్సిలర్లు, రాయచోటిలో మరో కౌన్సిలర్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే రాయచోటి నియోజకవర్గంలో ముగ్గురు కౌన్సిలర్లపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా...
ఈనెల 20వ తేదీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. 24వ తేదీ పరిశీలన చేస్తారు. 27వ తేదీ ఉపసంహరించుకొనేందుకు వీలు ఉంటుంది. అదేరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి విజేతల వివరాలను ప్రకటించనున్నారు.