ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం

Robbers Attacked On SBI Bank Was Foil - Sakshi

బ్యాంక్‌ వెనుక నుంచి చొరబడిన దుండగులు 

బరంపురం : బరంపురం ఎస్‌పీ కార్యాలయం పక్కన ఉన్న కొడాసింగ్‌ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో గురువారం రాత్రి దుండగులు దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమై వెనక్కు తగ్గి పరారయ్యారు. ఈ సంఘటన నగరంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. శుక్రవారం ఉదయం బ్యాంక్‌ సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహించేందుకు బ్యాంక్‌ను తెరవగా వస్తులువు చెల్లాచెదురుగా  పడిఉన్నాయి. దీంతో బ్యాంక్‌ సిబ్బంది ఎస్‌బీఐ జోనల్‌ కార్యాలయం, పోలీసులకు  సమాచారం చేరవేశారు.

సమాచారం అందుకున్న బీఎన్‌పూర్‌ పోలీసులు, జోనల్‌ కార్యాలయం సెక్యూరిటీ అధికారులు కొడాసింగ్‌ ఎస్‌బీఐకి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్‌ మేనేజర్‌ దిలీప్‌ కుమార్‌ దాస్, జోనల్‌ సెక్యూరిటీ అధికారి బ్రేగ్‌సింగ్, బీఎన్‌పూర్‌ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బీఎన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఎస్‌పీ కార్యాలయం మెయిన్‌ రోడ్‌లో గట కొడాసింగ్‌  ఏడీబీ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ లో గురువారం అర్ధరాత్రి బ్యాంక్‌ వెనుక వైపు నుంచి ఏసీ మెషీన్‌ను విరగ్గొట్టి దుండగులు చొరబడ్డారు.

లోన ఉన్న సీసీ  కెమెరాలకు చిక్కకుండా కెమెరాపై గుడ్డలు కప్పారు. అనంతరం గోద్రేజ్‌ బీరువా తాళాలు విరగ్గొట్టి లాకర్‌ రూమ్‌ తాళాల కోసం ప్రయత్నించారు. ఈ లోగా అలారం మోగడంతో వెనక్కు తగ్గి పరారయ్యారు. సమాచారం అందుకున్న బీఎన్‌పూర్‌ పోలీసులు,   ఎస్‌బీఐ జోనల్‌ సెక్యూరిటీ బృందం సంఘటనా స్థలంలో  అణువణువూ పరిశీలించారు. ఫోరెన్సిక్‌ టీమ్‌ కూడా   నేలమీద పడి ఉన్న దుండగుల అడుగులు, చేతి గుర్తులను సేకరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top