తనకంటే అందంగా ఉందని భార్యను.. | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతం

Published Sat, Jan 26 2019 10:43 AM

Husband Killed Wife in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: అనుమానంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా, చిట్యాలకు చెందిన నాగరాజు, జవలమ్మ(27) దంపతులు బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–5లోని దేవరకొండ బస్తీలో ఉంటున్నారు. వీరికి కార్తీక్, రిషి(8) అనే ఇద్దరు కుమారులు. నాగరాజు, జవలమ్మ వెంగళరావు పార్కు రోడ్డులో తోపుడుబండ్లపై వేర్వేరుగా కొబ్బరి బోండాలు విక్రయించేవారు. గత రెండేళ్లుగా నాగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనకంటే అందంగా ఉందని, తాను ఆమెకు సరిపోనని తరచూ జవలమ్మతో గొడవ పడేవాడు.

గురువారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి చ్చిన నాగరాజు భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన జవలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన నాగరాజు బంధువులకు ఫోన్‌ చేసి తన భార్యను చంపానని,  పారిపోతున్నట్లు తెలిపాడు. గురువారం రాత్రి అక్కడికి వచ్చిన ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం బంజారాహిల్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement