విజయనగరం ,పూసపాటిరేగ: మండల కేంద్ర సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తిప్పలవలస నుంచి పూసపాటిరేగ వైపు వస్తున్న బస్సు బలభద్రుని మిల్లు వద్ద మలుపు తిరుగుతుండగా, శ్రీకాకుళం నుంచి విశాఖవైపు వెళ్తున్న లారీ వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న కండక్టర్ లావణ్యతో పాటు రోడ్డు పక్కన వెళ్తున్న గొల్లపేటకు చెందిన గడిదేశి అశిరోడు, గడిదేశి సూరమ్మ, గడిదేశి రమాదేవి, రాములు, పూసపాటిరేగకు చెందిన త్రినాథ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సుందరపేట సీహెచ్సీకి తరలించారు. పూసపాటిరేగ ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.