ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు

Published Mon, Aug 26 2019 10:43 AM

Vice President Venkaiah Naidu Nellore Visit Schedule Released - Sakshi

సాక్షి, నెల్లూరు: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటన ఖరారైనట్లు తెలిసింది.  ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ మూడో తేదీ వరకు ఆయన జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. వెంకయ్యనాయుడు ఈ నెల 24 నుంచి మూడురోజుల పాటు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అందుకు అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.  శనివారం చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు బయలుదేరిన వెంకయ్యనాయుడు కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మృతిచెందడంతో తిరిగి వెనక్కివెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతి పర్యటన రద్దుకావడంతో గవర్నర్‌ సైతం విజయవాడకు వెళ్లారు. పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు పర్యటన తిరిగి ఖరారైంది.

పర్యటన ఇలా..
ఈ నెల 31వ తేదీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డుమార్గాన సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నగర్‌లోని తన స్వగృహానికి వెళతారు. అనంతరం వెంకటాచలం చేరుకుని స్పెషల్‌ ట్రైన్‌లో చెర్లోపల్లి రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడ నుంచి టన్నల్‌ను పరిశీలించి తిరిగి రాత్రి 7గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. స్వర్ణభారత్‌ ట్రస్టులో రాత్రి బసచేస్తారు. సెప్టెంబర్‌ ఒకటోతేదీ గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుని గూడూరు–విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుని సాయంత్రం వీపాఆర్‌ కన్వెన్షన్‌హాల్లో స్నేహితులతో సమావేశమవుతారు. రెండోతేది ట్రస్టులో వినాయకచవితి వేడుకల్లో పాల్గొంటారు. మూడోతేదీ ఉదయం పోలీసుకవాతుమైదానం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రేణిగుంటకు వెళతారు. దీంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.


 

Advertisement
Advertisement