అనుమానమే పెనుభూతం | The alleged penubhutam | Sakshi
Sakshi News home page

అనుమానమే పెనుభూతం

Nov 22 2014 7:32 AM | Updated on Nov 6 2018 7:56 PM

అనుమానమే పెనుభూతం - Sakshi

అనుమానమే పెనుభూతం

అనుమానం పెనుభూతమై భార్యను భర్త హతమార్చిన ఘటన కాకుమాను మండలం కొండపాటూరు ఎస్టీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

  • భార్యను హతమార్చిన భర్త
  •  ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
  •  అనాథలైన ఇద్దరు చిన్నారులు
  • కాకుమాను (పెదనందిపాడు): అనుమానం పెనుభూతమై భార్యను భర్త హతమార్చిన ఘటన కాకుమాను మండలం కొండపాటూరు ఎస్టీ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించి పొన్నూరులోని వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.

    ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్లుకు పెదనందిపాడుకు చెందిన వల్లెపు శ్రీలక్ష్మి (25)తో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ప్రమోద్, ప్రవీణ్ ఉన్నారు. వెంకటేశ్వర్లు ముఠాపని చేస్తుంటాడు.

    సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. తరుచూ భార్యాభర్తలు గొడవపడుతున్నారు. పెద్దల పంచాయితీ కూడా జరిగింది. వెంకటేశ్వర్లు తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం ఉంది.  గొడవలు చోటుచేసుకుని గత నెలలో శ్రీలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. నాలుగురోజుల క్రితం భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము ఐదు గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది.

    గొడవ తీవ్రమవడంతో విచక్షణ కోల్పోయిన వెంకటేశ్వర్లు కత్తి తీసుకుని భార్య శ్రీలక్ష్మి శరీరంపై పలుచోట్ల దారుణంగా పొడిచి హత్యచేశాడు. తాను కూడా క్రిమిసంహారక మందు తాగి ఇంట్లో అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఉదయం పక్కంటివాళ్లు వచ్చి మృతురాలి బంధువులకు  ‘మీ అమ్మాయి మందు తాగింది.. హాస్పటల్‌కు తీసుకువెళుతున్నారు’ అని ఫోన్‌చేసి తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును పొన్నూరులోని వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతున్నాడు.

    మృతురాలి సోదరుడు వల్లెపు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు సీఐ ఎం.వీరయ్య, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడికి తోడు అతని తమ్ముడు నాగరాజు కూడా హత్యాఘటనలో పాల్గొన్నాడని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. ఆ మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడని కోలుకోగానే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement