తాళమేస్తే కొంపకొల్లేరే | roberrys are entering in houses | Sakshi
Sakshi News home page

తాళమేస్తే కొంపకొల్లేరే

Aug 23 2013 4:26 AM | Updated on Aug 21 2018 9:20 PM

‘మీరు ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళుతున్నారా? మీ సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పోలీసులు ఆర్భాటంగా చెబుతున్న మాటలను నమ్మి నిశ్చింతంగా వెళ్లితే అంతే సంగతులు. ఇంటికి తాళాలు వేయడమే ఆలస్యం..

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ‘మీరు ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళుతున్నారా? మీ సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పోలీసులు ఆర్భాటంగా చెబుతున్న మాటలను నమ్మి నిశ్చింతంగా వెళ్లితే అంతే సంగతులు. ఇంటికి తాళాలు వేయడమే ఆలస్యం..తలుపులు ఇట్టే పగులుతున్నాయి. నగదు, ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. ఇది ప్రస్తుతం జిల్లాలో నెలకున్న పరిస్థితి. వరుస చోరీలతో జిల్లా ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లేందుకు జంకుతున్నారు.
 
 ఎందుకొచ్చిన ఖర్మరా దేవుడా అనుకుంటూ... కాలు బయటపెట్టడం లేదు. కొందరు మాత్రం ‘దేవుడా నీవే దిక్కు’ అంటూ గడపదాటుతున్నారు.  పగలు, రాత్రి అన్న తేడాలేకుండా తాళం వేసిన ఇళ్లను దొంగలు కొల్లగొడుతున్నారు. ఇక గొలుసు దొంగల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మహిళలు ఒంటరిగా నడిచివెళతుంటే చాలు...మెడలోని గొలుసులు మాయమవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో మహిళల నగలు మాయమవుతున్నాయి. రాత్రి వేళల్లో మహిళలను బెదిరించి దోచుకుంటున్న సంఘటనలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల నగరంలో వరుస చోరీలు పెరిగాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెలలో జిల్లాలో సుమారు రూ.కోటికి విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురి అయ్యాయి.  
 తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
 చోరులు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. చోరీ తర్వాత ఆ పరిసరాల నుంచి పరార్ అయ్యేందుకు తొలుత రెక్కీ నిర్వహించి ఆపై దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తోంది. ఆనవాళ్లు సైతం లభ్యంకాకుండా దొంగలు తెలవితేటలు ప్రదర్శిస్తున్నారు. క్లూస్‌దొరక్క పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల నగరంలో దొంగతనాలన్నీ ఒకే తరహాలో చోటు చేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి, ఇందిరానగర్ సెటిల్‌మెంట్ ఏరియా, ఇరువాక్కం, చిత్తూరు జిల్ల్లా ఓజికుప్పం, శ్రీకాళహస్తి, ఒంగోలు రామ్‌నగర్, స్టూవర్టుపురం ప్రాంతాలకు చెందిన ముఠాలు జిల్లాలో మాటేసి దోచేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 ఆర్భాటపు ప్రకటనలే
 చోరీలపై సిబ్బందిని అప్రమత్తం చేసి రాత్రి గస్తీ ముమ్మరం చేశామని పోలీసులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. గత అనుభవాలు ఇంకా వారికి పాఠాలు నేర్పలేదు. చోరీలను అరికట్టే విషయంలో పోలీసులు అప్రమత్తంగా  లేరనే విమర్శలున్నాయి.
 
 నిద్రావస్థలో  గస్తీ
 పోలీసుల గస్తీ కునుకేసింది. దొంగతనాలు జరిగిన సమయంలో సమీక్షలతో కాలయాపన చేస్తున్నారే తప్ప నియంత్రణకు తీసుకొంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. రాత్రిపూట గస్తీపేరుతో పోలీసులు ఏ టీ దుకాణంలోనో, సినిమా థియేటర్లలోనో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలున్నాయి.  
 
 వరుస చోరీలు
  జూలై ఆరోతేదీ  ఆత్మకూరులో పట్టపగలే ఇంట్లోకి జొరబడి సుమతి అనే మహిళను కత్తితో గాయపరిచి సుమారు 11సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు.
 
  బాలాజీనగర్‌లో జూలై 9న ఎల్లసిరి రాజా అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
 
  13వ తేదీ అరుణాచలం వీధిలో విశ్రాంత అధ్యాపకుడు మోహనరావు ఇంట్లో  200 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు, 20 కిలోల వెండి ఆభరణాలు అపహరించారు.
  14వ తేదీ బుజబుజనెల్లూరులో అరుణమ్మ అనే వృద్ధురాలిని మారణాయుధాలతో బెదిరించి రూ.2.50 లక్షల నగదు, నగలు దోచుకెళ్లారు.
 
  22వ తేదీ ధీరజ్ ఆర్కెడ్ అపార్ట్‌మెంట్‌లో కె. శ్రీనివాస్‌ప్లాట్‌లో 75 సవర్ల బంగారు, ఏడు కిలోల వెండిని దోచుకెళ్లారు.
 
  23వ తేదీ మాగుంటలేఅవుట్‌లో శాంతమ్మ అనే మహిళ ఇంటి వద్ద నిలబడి ఉండగా ఆరుసవర్ల బంగారు దండను దుండగులు లాక్కెళ్లారు.
 
  24వ తేదీ సరస్వతినగర్‌లోని సాహితి అపార్ట్‌మెంట్‌లో చిల్లకూరు రామ్మోహన్‌రెడ్డి ప్లాట్‌లో దొంగలు పడి సుమారు 4.20 లక్షలు విలువచేసే 19 సవర్ల  బంగారు, 40 వేల నగదును అపహరించారు.
 
  ఆగస్టు ఒకటోతేదీ కావలి జనతాపేటలో వరుస చోరీలు జరిగాయి. మూడుకిలోల వెండి, మూడు సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు.
 
  5వ తేదీ అరుణాచలం వీధిలో కృష్ణం రుమేష్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 14 సవర్ల బంగారు ఆభరణాలు, 10 వేల నగదు అపహరించారు.
 
  6వ తేదీ లక్ష్మీపురంలో రైసుమిల్లు నిర్వాహకుడు కనిశెట్టి ప్రకాష్‌రావు ఇంట్లో దొంగలు పడి నాలుగున్నర సవర బంగారు, 16 కిలోల వెండి ఆభరణాలు అపహరించారు.
  8వ తేదీ ముకుందాపురానికి చెందిన స్వరూపరాణి పాలకోసం నడిచివెళుతుండగా ఆరుసవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
 
  అదే రోజు స్నేహనగర్‌లో వెంకటలక్ష్మి  టైలరింగ్ షాపువద్దకు వెళుతుంగా మూడున్నర సవర్ల బంగారు సరుడును లాకెళ్లారు.
 
  21న అరుణాచలం వీధిలో గోవిందరాజులు ఇంట్లోదొంగలు పడి 9 సవర్ల బంగారు, కిలో వెండి అపహరించారు.
 
  తాజాగా 21వ తేదీ అంజుమాన్‌వీధిలో అల్లాభక్షు ఇంట్లో దొంగలు పడి 1.80 లక్షల నగదు, 22 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు.
 
 జాగ్రత్త..
 దొంగల కళ్లన్నీ బంగారంపైనే ఉన్నాయి. జాగ్రత్తలు అనివార్యం. వెయ్యి కళ్లతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. ఇంట్లో ఆభరణాలు ఉంచి  ఊర్లకు  వెళ్లరాదు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎవరో ఒకరైనా ఇంట్లో  ఉండేలా జాగ్రత్తపడాలి. బ్యాంకుల్లో లాకర్లున్నవారు ఆభరణాలను ఎప్పటికప్పుడు వాటిలో ఉంచేయడం శ్రేయస్కరం. ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు మహిళలకు ఎక్కువ ఆభరణాలు ధరించకపోవడం మంచిది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement