మైకు హోరు లేదు.. వందల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీలు లేవు... బహిరంగ సభలు లేవు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్
అమలాపురం :మైకు హోరు లేదు.. వందల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీలు లేవు... బహిరంగ సభలు లేవు. అయినా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఓటర్లయిన ఉపాధ్యాయులు, అధ్యాపకులను నేరుగా కలసి మద్దతు కోరుతున్నారు. తాము చేసిన సేవలు, చేస్తున్న కార్యక్రమాలు, తమను గెలిపిస్తే చేపట్టే కార్యక్రమాలను సైతం వివరించే పాంప్లెట్లు అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. అభ్యర్థులతోపాటు వారికి మద్దతుగా నిలిచిన వివిద ఉపాధ్యాయ, అధ్యాపక వర్గాలు సైతం తమ సంఘాల పరిధిలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలసి ఓట్ల కోసం అర్థిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే దీనిని తలదన్నే ప్రచారం విభిన్నంగా సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) ద్వారా ముమ్మరంగా సాగుతోంది. అభ్యర్థులు ఫేస్బుక్, ట్విట్టర్లలో విస్తారంగా ప్రచార పోస్టులు పెడుతున్నారు. గతంలో తాము చేసిన సేవాకార్యక్రమాలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేస్తున్నారు. గెలిస్తే చేపట్టే కార్యక్రమాలతో రూపొందించిన కరప్రతాలను, ప్రచారం సమయంలో తమకు వస్తున్న ఆదరణకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫోన్ మెసేజ్ల రూపంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం విస్తారంగా సాగుతోంది. ఒక్కొక్క అభ్యర్థి నుంచి ఉపాధ్యాయులకు రోజుకు ఐదారు మెసేజ్లు వస్తున్నాయి.
‘నన్ను బలపరచండి.. మీకు అండగా ఉంటాను’ ‘గెలిపిస్తే మీ సేవకే అంకితమవుతాం’ అంటూ నిత్యం ఎస్ఎంఎస్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ప్రధాన అభ్యర్థులు కలిదిండి వీరవెంకట సత్యనారాయణరాజు (చైతన్యరాజు), పరుచూరి కృష్ణారావు, రాము సూర్యారావులు ఈ తరహా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంలో కూడా అభ్యర్థులు పోటీ పడ్డారు. సోషల్ మీడియా, సెల్ఫోన్ల ద్వారా ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్టు చేసి అందులో ఖాతాలు ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.