ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మచిలీపట్నం : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని అధికార పార్టీకి చెందిన నాయకులంతా రంగంలోకి దిగి టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గెలుపు కోసం ఉపాధ్యాయులు చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఎత్తుకు పై ఎత్తులు, ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు బిజీగా ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందని, మీ వారందరినీ టీడీపీ బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన ఓ మంత్రి మచిలీపట్నంలో గురువారం రాత్రి గంటల తరబడి మంతనాలు జరిపినట్లు సమాచారం. తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపి ంచేందుకు టీడీపీ నాయకులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. వంద ఓట్లు లోపుగా ఉన్న మండలాలను గుర్తించి అక్కడ నగదు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయంపై పీడీఎఫ్ నాయకులు ఆందోళనకు దిగటంతో శుక్రవారం సాయంత్రానికి 35 నుంచి 40శాతం మాత్రమే నగదు పంపిణీ చేయగలిగారనే వార్తలు వినిపించాయి.
జిల్లాలో 9,762 మంది ఓటర్లు
ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 9,762 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 5,659 మంది, మహిళలు 4,103 మంది. 51 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రి సిద్ధమయ్యాయి. పోలింగ్ పూర్తయిన అనంతరం ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తారు. అక్కడి నుంచి గుంటూరులోని స్ట్రాంగ్ రూమ్కు వెళ్తాయి.