అనుమానితుల్ని క్వారంటైన్‌లో ఉంచాం

Deputy Chief Minister Alla Nani Comments Over Coronavirus - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఇప్పటివరకు 385 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. వారిలో 317 మందికి నెగిటివ్‌ వచ్చిందని, 55 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులున్నాయని చెప్పారు. అనుమానిత లక్షణాలున్న వారందరినీ క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. కృష్ణా జిల్లాలో 2,540 మంది విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని వెల్లడించారు. కరోనా వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

విజయవాడ జీజీహెచ్‌ను కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రిగా ఏర్పాటు చేశామని, కృష్ణా, గుంటూరు, ప.గో.జిల్లాలకు సంబంధించినవారికి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిద్ధార్ధ కాలేజీని కృష్ణా జిల్లాకు ప్రత్యేకంగా కోవిడ్‌-19 ఆస్పత్రిగా ప్రకటించామన్నారు. సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా స్క్రీనింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా వ్యాపించకుండా అన్ని ప్రాంతాల్లో రైతు బజార్లను వికేంద్రీకరించామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top