తుపాను నష్టం రూ.850 కోట్లు

తుపాను నష్టం రూ.850 కోట్లు - Sakshi


 శ్రీకాకుళం పాతబస్టాండ్: హుదూద్ తుపాను, వరదలకు జిల్లాలో రూ.850 కోట్లకు పైగా పంట, ఆస్తినష్టం వాటిల్లిందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. వ్యవసాయ సర్వే పూర్తి కాలేదని, పూర్తయితే ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో తుపాను నష్టం వివరాల సేకరణ పూర్తవుతుందన్నారు. తుపాను బాధితులందరికీ ప్రభుత్వ ప్యాకేజీ అమలు చేస్తామని పేర్కొన్నారు.

 

 జియోట్యాగింగ్ లేనట్టే

 ఇప్పటికే పలు బృందాలు గ్రామల్లో సర్వేలు చేస్తున్నాయని, ఈ దఫా జీపీఆర్‌ఎస్(జియో ట్యాగింగ్) సర్వేను మినహాయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగు, వైద్య శిబిరాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బియ్యం పంపిణీ చేశామని, రెండు మూడు రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పారు. కేవలం ప్రభావిత గ్రామల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ బియ్యం, ఉల్లి, నూనె, ఉప్పు వంటి నిత్యావసరాలు అందజేస్తామని తెలిపారు. ఈ సరుకుల పంపిణీలో అవినీతి జరగకుండా ఉండేందుకు విజిలెన్సు, పోలీస్ నిఘా ఉంటుందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కూరగాయలకు ఇబ్బంది లేకుండా రైతు బజార్లులో కిలో రూ.3లకే విక్రయిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో ఉల్లి, బంగాళ దుంపలు పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎప్పీ ఏఎస్ ఖాన్, విజిలెన్సు డీఎస్పీ ఆర్‌ఎస్ ఆర్‌కే రాజు డీఆర్‌లో నూరు బాషా కాశీం తదితరులు ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top