గోదావరి నదిలో ఇసుక రీచ్లను నిర్వహించిన సొసైటీల వారు ఆడిటింగ్కు రికార్డులు ఇవ్వకపోతే షోకాజ్ నోటీసు జారీ చేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని ఐటీడీఏ పీవో వీరపాండియన్ హెచ్చరించారు.
భద్రాచలం, న్యూస్లైన్: గోదావరి నదిలో ఇసుక రీచ్లను నిర్వహించిన సొసైటీల వారు ఆడిటింగ్కు రికార్డులు ఇవ్వకపోతే షోకాజ్ నోటీసు జారీ చేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని ఐటీడీఏ పీవో వీరపాండియన్ హెచ్చరించారు. బుధవారం తన చాంబర్లో ఇసుక రీచ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం డివిజన్లో ఇసుక రీచ్లను పీసా చట్టం ద్వారా గిరిజన సొసైటీలకు అప్పగించామన్నారు. సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పడిన సొసైటీల్లో ఎలాంటి లోపాలు జరిగినా సదరు సొసైటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఆడిటింగ్కు సహకరించకపోతే భవిష్యత్ పరిణామాలకు సంఘాల వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రికార్డుల తయారీలో ఏవైనా సందేహాలుంటే సహకార శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. రికార్డులు సరిగా లేకపోవటంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నామని, దీంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. రీచ్ల ద్వారా తీసిన ఇసుకలో 50 శాతం కమర్షియల్గా, 25 శాతం స్థానిక అవసరాలకు, మరో 25 శాతం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అందించాల్సి ఉందని సూచించారు. ఇది అమలవుతుందా లేదా అనేది భూ గర్భ గనుల శాఖ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. భద్రాచలం ఇసుక రీచ్ రికార్డులను సదరు సొసైటీ వారు ఇవ్వటం లేదని డివిజనల్ సహకార అధికారులు పీవో దృష్టికి తీసుకురాగా, ఆడిటింగ్ కోసం తప్పని సరిగా సొసైటీల వారు రికార్డులను సహకార అధికారులకు ఇవ్వాల్సిందేనని చెప్పారు. సమావేశంలో భద్రాచలం ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, ఏపీవో జనరల్ శ్రీనివాస్రావు, డివిజనల్ సహకార అధికారులు పాల్గొన్నారు.