పిల్లల ప్రయోజనాలే ముఖ్యం | Children interests are important | Sakshi
Sakshi News home page

పిల్లల ప్రయోజనాలే ముఖ్యం

Mar 27 2018 3:22 AM | Updated on Aug 31 2018 8:57 PM

Children interests are important - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల విషయంలో వారి పిల్లల కస్టడీకి సంబంధించి విదేశీ కోర్టులు ఏవైనా ఆదేశాలు జారీచేసినప్పుడు, కస్టడీకి అప్పగించే విషయంలో మన దేశంలోని కోర్టులు ఆ పిల్లల సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. విదేశీ కోర్టు జారీచేసిన కస్టడీ ఆదేశాలు ఆ పిల్లల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే.. మన కోర్టులు స్వీయ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

ఇలా ఓ కేసులో జన్మతః యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) పౌరులైన ఇద్దరు మైనర్‌ పిల్లల భవిష్యత్తు, చదువు తదితర విషయాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు వారిని తండ్రి కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా, మదనపల్లెకు చెందిన జి.శిరీషకు, యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో ఫిజియోథెరపీ టీమ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న తిరుపతికి చెందిన తిప్పా శ్రీహరితో 2009లో వివాహం జరిగింది.

వీరికి యూకేలోనే అభివన్, దివిత్‌ అనే ఇద్దరు పిల్లలు పుట్టగా.. అక్కడి పాఠశాలలోనే చదువుతున్నారు. భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో 2017లో శ్రీహరిపై శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిని పోలీసులు అరెస్ట్‌చేసి 24 గంటల పాటు జైల్లో ఉంచారు. శిరీష తన ఇద్దరు పిల్లలతో ఇండియాకొచ్చారు. ఈ నేపథ్యంలో విడాకులు కోరుతూ శ్రీహరి యూకే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు పిల్లలను తండ్రి కస్టడీలో ఉంచాలని శిరీషను ఆదేశించింది. దీనికి శిరీష స్పందించకపోవడంతో శ్రీహరి మన హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పైఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement