ఎర్రగడ్డ ప్రేమ్నగర్కు చెందిన సందీప్ (24), బోరబండ వినాయకరావునగర్కు చెందిన మాధవి (22)కి నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. డిగ్రీ వరకు చదివిన సందీప్ ప్రస్తుతం మోతీనగర్లోని రాయుడు బిర్యాని హోటల్లో సూపర్వైజర్గా పని చేస్తుండగా, మాధవి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తొలుత వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. సందీప్ దళిత వర్గానికి, మాధవి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కావడం పెళ్లికి అడ్డంకిగా మారింది. వీరి వివాహానికి సందీప్ కుటుంబ సభ్యులు అంగీకరించినా... మాధవి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కులమే కాక మాధవిని తన సమీప బంధువుకు ఇవ్వాలని ఆమె కుటుంబీకులు భావించడం దీనికి కారణం. దీంతో పెద్దలను ఎదిరించి ఈ నెల 12న అల్వాల్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి రక్షణ కల్పించాలని కోరారు. ఇరువురు మేజర్లు కావడంతో పోలీసులు వారి కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాధవి తండ్రి మనోహరచారి సైతం వివాహం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వెళ్లిపోయాడు.