
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు స్థల పరిశీలన
హసన్పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం 25 ఎకరాల మేరకు స్థలం అవసరం ఉండగా, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రెండు రోజులుగా రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాలు పరిశీలించారు. మామునూరు, హసన్పర్తి మండలం భీమారంలోని కొచ్చెరు, పెగడపల్లిల్లో భూములను పరిశీలించారు. భీమారంలోని సర్వే నంబర్ 70లో స్కూల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్యే భావించారు. ఎన్ని ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కిరణ్, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్, నాయకులు ఐలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ దాడులు
దుగ్గొండి: మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ల ఆధారంగా తనిఖీలు చేశారు. అయితే కొన్ని సీడ్ దుకాణాల్లో పీసీలు, (ప్రిన్సిపుల్ సర్టిఫికెట్) లేకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండల కేంద్రంలోని పరమేశ్వర సీడ్స్, మనగ్రోమోర్ సెంటర్లలో పీసీలు లేని విత్తనాలు లభించడంతో వాటి అమ్మకాన్ని నిలిపేయాలని ఆదేశించి సీజ్ చేశారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రియ, మండల వ్యవసాయ అధికారి మాధవి, హెచ్ఈఓ హన్మంతు పాల్గొన్నారు.
అనారోగ్యంతో
ఇద్దరి ఆత్మహత్య●
● గవిచర్లలో విషాదం
సంగెం: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని గవిచర్లలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన పెండ్లి సాయమ్మ (72)కు కొన్నేళ్ల క్రితం కుమారుడు, భర్త చనిపోయారు. చిన్నకుమారుడి ఇంటి ఎదుట ఆమె జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే తగ్గింది. అప్పటి నుంచి తరచూ జ్వరంతో బాధపడుతోంది. షుగరు, బీపీ పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది. ఆరోగ్యం కుదుట పడడంలేదనే మనస్థాపంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది..
గవిచర్ల గ్రామానికి చెందిన కందుల సరోజన(53) అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. సరోజన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారుడు మోహన్ ఇటీవల ఆమెకు వరంగల్లో చికిత్స చేయించాడు. అయినప్పటికీ కడుపులో మంట, అలసటతో జీవితంపై విరక్తి చెంది.. శనివారం సాయంత్రం బాత్రూమ్ లోపల చీరతో ఉరేసుకుంది. భర్త కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఒకే రోజు, ఒకే గ్రామంలో, అనారోగ్యంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో గవిచర్లలో విషాదం నెలకొంది.
విదేశాల్లో విద్యకు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మైనార్టీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ఫ్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్కు స్థల పరిశీలన