
9 నుంచి టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర (ఎస్వీ), శ్రీపద్మావతి మహిళా (ఎస్పీడబ్ల్యూ) జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆ మేరకు ఎస్వీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.ప్రకాష్బాబు తెలిపారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్, తెలుగు, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్వీ జేసీలో 792 సీట్లకు దాదాపు 5,200 మంది, ఎస్పీడబ్ల్యూ జేసీలో 968సీట్లకు దాదాపు 9వేల మంది విద్యార్థులు టీటీడీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారని, ఆయా విద్యార్థులకు ఇదివరకే సమాచారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. వీరికి 9వ తేదీ నుంచి తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారని, మిగిలిన సీట్లకు మలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించి భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు పొందిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.4,400/–, సైన్సు విద్యార్థులు రూ.5,350/– ఫీజు చెల్లించాలని చెప్పారు. హాస్టల్లో సీటు పొందిన వారు హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ టీసీతో పాటు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.