
డెంగ్యూపై అవగాహన
తిరుపతి తుడా : జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ అవగాహన దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి స్విమ్స్ ఆసుపత్రి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగ్యూ కేసులు జిల్లాలో నమోదు అయ్యాయని తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం వల్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ డెంగ్యూ దినంను ఏటా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమలో జిల్లా అధికారులు డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, డీపీఎంఓ శ్రీనివాసులు, డాక్టర్ మురళీ కృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 760 గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 10,281 మందికి 658 మంది విద్యార్థులు గైర్హాజరవ్వడంతో 9,623 మంది పరీక్షను రాశారు. అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షకు 24 పరీక్షా కేంద్రా ల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్, ఒకేషనల్లో కలిపి 1,570 మందికి 102 మంది గైర్హాజరవ్వడంతో 1,468 మంది విద్యార్థులు పరీక్షను రాసి నట్లు ఆర్ఐఓ జీవి ప్రభాకర్రెడ్డి తెలిపారు.
టీడీపీ గుండాలపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి
తిరుపతి మంగళం : తిరుపతి 50వ డివిజన్కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోకం అనిల్కుమార్పై దాడి చేసిన టీడీపీ గూండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాని బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్రాజును వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కలిసి ఫిర్యాదు చేశారు. తమ కార్పొరేటర్ అనిల్ను చంపడానికి ప్రయత్నించారని, అందుకు తగిన విధంగా 307 కేసు నమోదు చేయాలని పార్టీ నాయకులు ఎస్పీని కోరారు. మరోసారి ఇలా జరగకుండా అనిల్కు రక్షణ కల్పించాలని పార్టీ నాయకులు కోరారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, పార్టీ నాయకులు మద్దాలి శేఖర్, అనిల్రెడ్డి, కుప్పయ్య, న్యాయవాది చంద్ర, కార్పొరేటర్ అనిల్కుమార్ తల్లి కుప్పమ్మ, అక్క కాటమ్మ ఉన్నారు.
ముగిసిన వీసీఐ బృందం పర్యటన
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. మూడు రోజులుగా వీసీఐ బృందం కళాశాలలోని పలు విభాగాలు, క్లినిక్లను, ల్యాబ్లను, కళాశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించింది. సమస్యలు, వసతుల కల్పనపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. బృందం పరిశీలించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు.

డెంగ్యూపై అవగాహన