
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్ : ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను గురువారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయాల ని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తొలిరోజే వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. మొత్తం 2,61,230 మందికి రూ.111.84 కోట్లు అందించనున్నట్లు వెల్లడించారు. డీఎల్డీఓ, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రశాంతంగా పాలిసెట్
– 87.56శాతం మంది విద్యార్థులు హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్హతతో పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఏటా రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ నిర్వహించే పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష బుధవారం జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు తిరుపతి జిల్లా నుంచి మొత్తం 5,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతిలో 8, గూడూరులో 5, సత్యవేడులో 2 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ ఎ.నిర్మల్కుమార్ ప్రియ, జిల్లా పరిశీలకులు డాక్టర్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ ఎంఆర్ ధీరేంద్రబాలు, పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ ఎస్వీ గౌరీశంకర్ పర్యవేక్షణలో పాలిసెట్ ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు తిరుపతిలో 3,778 మందికి 3,363(89.09శాతం)మంది, గూడూరులో 1,221 మందికి 1,037 (84.9శాతం) మంది, సత్యవేడులో 300 మందికి 240(80శాతం) మంది, మొత్తం 5,299మందికి 4,640(87.56శాతం) మంది హాజరుకాగా, తిరుపతిలో 415 మంది, గూడూరులో 184 మంది, సత్యవేడులో 60 మంది గైర్హాజరైనట్లు పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ తెలిపారు.
అధ్యాపకుల పాత్ర కీలకం
తిరుపతి సిటీ: జాతీయ నూతన విద్యావిధానం అమలులో అధ్యాపకులది కీలక పాత్రని అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘ్ (ఏబీఆర్ఎస్ఎమ్) జాతీయ సహా సంఘటన కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం జాతీయ సంస్కృత వర్సిటీలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు అంశాలపై చర్చించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు, శిక్షణ, పరిశోధనలు ె మెరుగుపడతాయన్నారు. దీంతో మన వర్సిటీలు ప్రపంచ విశ్వ విద్యాలయాలతో పోటీపడే పరిస్థితి వస్తుందని వెల్లడించారు. భారతదేశ విద్యా రంగంలో సవాళ్లు, మార్పులు అనే అంశంపై జూలై 26, 27 చైన్నెలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎమ్ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ బుల్టిదాస్, డాక్టర్ బాలసుబ్రమణ్యం, ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ చందూలాల్, డాక్టర్ శ్రీ లేఖ, డాక్టర్ కుమార్, డాక్టర్ సంధ్య, డాక్టర్ వివేక్, డాక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
నూతన కోర్సులు అవసరం
తిరుపతి సిటీ: విద్యార్థులకు ఉపాధే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందించి అధునాతన అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు తీసుకురావాలని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు సూచించారు. బుధవారం ఢిల్లీ వేదికగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ భవిష్యత్ – నూతన రంగాలలో కోర్సులు అనే అంశంపై చేపట్టిన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త కోర్సులు తీసుకురావాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, పరిశ్రమల మధ్య అనుసంధానం పెంపొందించి కోర్సులు రూపొందించడం, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్ట్లు చేయించాలని కోరారు. ఉపాధ్యాయుల శిక్షణ, డిజిటల్ మాధ్యమాల వాడకం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదస్సులో ఎస్వీయూ నుంచి రూసా కో–ఆర్డినేటర్ రమశ్రీ, సీఈఓ వంశీ రాయల్ పాల్గొన్నారు.

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

నేటి నుంచి పింఛన్ల పంపిణీ