– ప్రేమలత విజయకాంత్ ఆరోపణ
సేలం: తమిళనాడులో ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా విజయకాంత్ ఆరోపించారు. సేలంలో విలేకరులతో ఆదివారం ఆమె మాట్లాడుతూ, తమిళనాడు అంతటా డీఎండీకే దాని మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా తాను ప్రచారం చేస్తున్నానని, ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్టు వివరించారు. తమ కూటమి 200లకు పైగా స్థానాలలో గెలవడం తథ్యమన్నారు.సీఎం స్టాలిన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైందన్నారు.
తిరుమావళవర్తో వివాదంపై స్పష్టత
కడలూరులో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అభ్యర్థుల ప్రకటన సమయంలో తలెత్తిన చిన్న విషయాన్ని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోద రుడు తిరుమావళవన్ ఇప్పటికే దీనిపై వివ రణ ఇచ్చారన్నారు. తామిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని, విజయకాంత్, తిరుమావళవన్ సోద రుల తరహాలో ఉండేవారన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాను పోటీ చేస్తున్న విరుదాచలం నియోజకవర్గంలో ఆయన ప్రచారానికి రానున్నారన్నారు.
అధికారుల బదిలీలపై కుట్ర ఆరోపణ
ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు సహజమే అయినా, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పలువురు ఉన్నతాధికారులను మార్చడం వెనుక అంతర్గత రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. వీటన్నింటికీ మే 4వ తేదీన వెలువడే ఫలితాలే సమాధానం చెబుతాయని అన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంపై స్పందిస్తూ, అది ఆయన ఇష్టమని, గతంలో కూడా చాలా మంది ఇలాగే పోటీ చేశారని, ఇందులో కొత్తేమీ లేదని అన్నారు.


