సాక్షి, చైన్నె : తనలో ‘ప్రాణం ఉన్నంత వరకు అన్బుమణితో రాజీ ప్రసక్తే లేదని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పీఎంకేలో పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాను బ్రతికి ఉన్నంత కాలం అన్బుమణితో రాజీ పడే ప్రసక్తే లేదని, చర్చలకు తావులేదని రామదాస్ తాజాగా ప్రకటించడం చర్చకు దారి తీసింది.
కుమార్తెకు పార్టీ పగ్గాలు
తన తర్వాత పార్టీని తన కుమార్తె శ్రీగాంధీ నడిపిస్తారని శనివారం రాందాస్ ప్రకటించారు. గతంలో తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రా రని చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు అందరూ రాజకీయాల్లోకి రావడం తాను చేసిన అతిపెద్ద తప్పిదమని, ఆ తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్బుమణిపై ఆరోపణలు
డబ్బు ప్రభావంతో అన్బుమణి చాలా మందిని కొనుగోలు చేస్తున్నారని రాందాస్ ఆరోపించారు. తన వర్గం 37 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, అన్బుమణి వర్గం పోటీ చేస్తున్న స్థానాల్లో తాను 12 మంది అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. అయితే అన్బుమణి ఒత్తిడి వల్ల కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో తప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ చిహ్నమైన ‘మామిడి పండు’ గుర్తు తమదేనని, దాని కోసం న్యాయపోరాటం చేస్తామ ని రాందాస్ తెలిపారు. కష్టపడి నిర్మించుకున్న పార్టీ ఇలా విచ్ఛిన్నం కావడం తనను ఎంతగానో బాధించిందన్నారు.
రాజకీయ పొత్తులు
డీఎంకేతో జరిగిన పొత్తు ప్రయత్నాల గురించి మాట్లాడుతూ, మమ్మల్ని వదిలేసింది తన వాళ్లే ననిపేర్కొంటూ, డీఎంకే మనసులో తాము ఎవరూ లేమని వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడైనప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమని చెప్పారు.


