సాక్షి,చైన్నె : రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే), సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలు పోటీలో ఉన్నా, ప్రధాన సమరం మాత్రం ద్విముఖమే అని బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేశారు. ఈ ద్విముఖ సమరం రెండు ప్రదాన కూటముల మధ్య మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. నీలగిరి జిల్లా ఊటీలో బీజేపీ అభ్యర్థి ఎం భోజరాజన్ తరఫున శుక్రవారం అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో అన్నామలై ఊటీకి రావడం గమనార్హం. ఆయన హెలికాప్టర్ను ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేసింది.
ద్విముఖ పోరు
ఎన్నికల క్షేత్రంలో అనేక పార్టీలు ఉన్నా, చివరకు పోటీ అధికార డీఎంకే, ప్రదాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య మాత్రమే ఉంటుందని తన ప్రసంగంలో అన్నామలై స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఊటీలో విజయాన్ని కోల్పోయామని, ఈ ఐదేళ్లలో తాము చేసిన కృషి, సహకారం, అన్నాడీఎంకే మద్దతుతో ఈసారి భోజరాజన్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అనుకూల పవనాలు
పుదుచ్చేరిలో 90 శాతం మేరకు పోలింగ్ నమోదు కావడంతో అధికార ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. తమిళనాడు విషయానికి వస్తే మే 4 తర్వాత కొత్త మార్పు జరగబోతోందన్నారు. ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో తమిళనాడులో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్గోయల్, ఇతర ముఖ్యనేతలు ఊటీలో ప్రచారానికి సిద్ధమయ్యారు.


