తమిళసినిమా: మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయి ఈ మధ్యనే బెయిల్పై విడుదల అయిన సినీ నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఈ నెల 6వ తేదిన ఐటీ అధికారులు ఎన్నికల స్క్వాడ్ అధికారులు చైన్నెలోని నిర్మాత జాఫర్ సాధిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాఫర్ సాదిక్ ఐటీ అధికారులు, ఎన్నికల స్వ్కాడ్ అధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేది ఉదయం ఆరు గంటల నుంచి వేకువ జామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, అయితే ఎలాంటి అనధికార డబ్బు గానీ, ఇతర డాక్యుమెంట్స్ గాని లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్ళిపోయారన్నారు. తాను ఇంటిలో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదే విధంగా ఇంతకు ముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే విధంగా తాను నిర్మిస్తున్న చిత్రాల విడుదల కార్యక్రమంలో నిమగ్నమైనట్లు నిర్మాత జాఫర్ సాధిక్ పేర్కొన్నారు.


