సేలం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (తమిళనాడు, పుదుచ్చేరి) దక్షిణ జోన్ ఎండీగా వీసీ అశోకన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తమిళనాడు, పుదుచ్చేరిలోని చమురు పరిశ్రమకు రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేటర్ (ఎస్ఎల్సీ)గా కూడా పనిచేయనున్నారు. చమురు, గ్యాస్ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా విస్తృతమైన, విభిన్నమైన అనుభవం కలిగిన అశోకన్. అశోకన్ తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు. ఈయనకు భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన మార్కెటింగ్ అనుభవం ఉంది. తన ప్రస్తుత పదవికి ముందు అశోకన్ ముంబైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా హెడ్ ఆఫ్ రీటైల్గా పని చేశారు.
అభ్యర్థుల మధ్య వివాదం
కొరుక్కుపేట: సెంజిలో పీఎంకే పార్టీ జెండా విషయంగా రామదాసు, అన్బుమణి అభ్యర్థుల మధ్య వివాదం రాసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం చివరిరోజు కావడంతో సెంజీ అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే , పీఎంకే, అన్బుమణి వర్గం , పీఎంకే రామదాస్ వర్గం, తమిళనాడు వాళువురిమై పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు సహా 15 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు ధాఖలు చేశారు. ఇందులో పీఎంకే అన్బుమణి వర్గానికి చెందిన అభ్యర్థి గణేష్కుమార్, రిటర్నింగ్ అధికారి తమిళరసన్కు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు రామదాస్ వర్గం తరఫున కనల్ పెరుమాల్ తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చినప్పుడు మెడలో పీఎంకే జెండా, బ్యాడ్జ్ ధరించి ఉన్నారు. ఆసమయంలో అన్బుమణి వర్గానికి చెందిన గణేష్కుమార్, రామదాస్ వర్గం అభ్యర్థి కనల్ పెరుమాల్ తో మీరు పీఎంకే జెండా బ్యాడ్జ్ ధరించకూడదని దాన్ని తీసివేయండని అన్నారు. కనల్ పెరుమాల్ దానిని వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు
తిరువొత్తియూరు: ప్రైవేటు బస్సు విద్యుత్ స్థంభంను ఢీ కొట్టిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. గర్భిణి సహా 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని కురుంబూరు నుండి మంగళవారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరిన ప్రైవేటుబస్సు తూత్తుకుడి మరవన్మడం సమీపంలోకి వస్తుండగా తూత్తుకుడి నెల్లై ప్రధాన రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బ్రేక్కు బదులుగా ఎక్సిలేటర్ను తొక్కినట్టు తెలిసింది. దీంతో విద్యుత్ స్తంభాన్ని, తాటిచెట్టును బస్సు ఢీకొంది. డ్రైవర్ మణిముత్తు తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మెరుగైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా!
కొరుక్కుపేట: వేలచ్చేరి కాంగ్రెస్ అభ్యర్థి ఆసన్ మౌలానా మంగళవారం నియోజకవర్గం అంతటా సుడిగాలి ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు మద్దతు కూడగట్టేందుకు మిత్రపక్షాలు పెద్దసంఖ్యలో గుమికూడాయి .సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఐదేళ్లలో తాను ముఖ్యమంత్రి స్టాలిన్ సాయంతో పలు ప్రాజెక్టులను పూర్తి చేశానన్నారు. రూ.420 కోట్లతో కొత్త వర్షపునీటి కాలువను నిర్మించానని, మళ్లీ అవకాశం ఇస్తే భవిష్యత్తులో వేలచ్చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.


