తిరువళ్లూరు: రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శన నడుమ డీఎంకే అన్నాడీఎంకే అభ్యర్థులు ర్యాలీగా వచ్చి తమ నామినేషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో నామినేషన్ల ప్రక్రియ గత 30న ప్రారంభమైంది. ఇప్పటికే తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, ఆవడి, అంబత్తూరు, మధరవాయల్, మాధవరం తదితర నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్కు ఆఖరిరోజు కావడంతో తిరువళ్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు బలప్రదర్శనగా వచ్చి నామినేషన్లు వేశారు. డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఆర్ఎస్ భారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం మద్దతుదారులతో కలిసి స్థానిక కామరాజర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. ఆ తర్వాత కూటమి నేతలతో కలిసి రాజేంద్రన్ నామినేషన్ను దాఖలు చేశారు. అలాగే, అన్నాడీఎంకే అభ్యర్థి బీవీ రమణ తన మద్దతుదారులతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారి మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ కార్యదర్శి పన్నీర్సెల్వం, పీఎంకే రాష్ట్ర ఉప కార్యదర్శి బాలయోగి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


