
వైభవం.. వైఖాసి విశాఖ ఉత్సవం
తిరుత్తణి: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం వైఖాసి విశాఖ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుత్తణి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. భక్తులు క్యూలో వేచివుండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు చేసి, బంగారు కవచంతో అలంకరించి, మహాదీపారాధన పూజలు చేశారు. విశాఖ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుత్తణి కొండకు పోటెత్తారు. ఉదయం 8 గంటలకు షణ్ముఖర్కు విభూది, కదంబం, పాలు, పన్నీరు, పెరుగు, పంచామృతం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి, విశేషాలంకరణ చేశారు. ఇందులో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో..
వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లోని పెరుమాళ్, మురుగన్ ఆలయాల్లో వైఖాసి విశాఖ ఉత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వేలూరు సైదాపేట ఆర్కాడు రోడ్డులోని పయణి ఆండవర్ ఆలయంలో వైఖాసి ఉత్సవాన్ని పురష్కరించుకుని ఉదయం 6 గంటలకు నవ కలశ స్థాపన, వెండి పూజ చేశారు. అనంతరం ఆలయంలో శుత్రు సంహార యాగ పూజలు నిర్వహించారు. 11 గంటలకు మహా దీపారాధన పూజలు చేశారు. అలాగే తోటపాళెంలోని తిరుచెందూర్ అన్నదాన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుప్పుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆరాధన నిర్వహించారు. అనంతరం తోటపాళెం ధర్మరాజ ఆలయ సమీపంలోని మైదానంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం చేసి, నిరుపేదలకు పంచెలు, చీరలను అందజేశారు. ఉత్సవ కమిటీ నిర్వహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైఖాసి విశాఖాన్ని పురష్కరించుకుని కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానంతో పాటు దుస్తులను అందజేస్తామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి విజిటి సుందర్, కోశాధికారి వీఎన్ రాజు, సభ్యులు బాలాజీ, షణ్మగం, వెర్టివేలన్, మేహనవేల్, తనిగవేల్, సురేష్ బాబు పాల్గొన్నారు. అలాగే తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని మురుగన్ సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన పూజలు చేశారు.
వైభవంగా బాలమురుగన్ రథోత్సవం
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకాలోని రత్నగిరి బాల మురుగన్ ఆలయంలో వైఖాసి విశాఖ ఉత్సవాల్లో బాగంగా సోమవారం ఉదయం మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం ఆలయ స్వామిజీ బాల మురుగన్ అడిగల్ స్వామిజీ, కలవై సచ్చిదానం స్వామిజీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, దీపారధనలు చేసి, రథంలో కొలువుదీర్చారు. అనంతరం పీఠాధిపతులు రథం దారానికి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఈశ్వరప్పన్ కలుసుకుని రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు హరోం హర నామస్మరణాల నడుమ భక్తులు రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రథం ఆలయ కొండ చుట్టుకుని, ఆలయానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకుంది. రథోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో గణపతి హోమం, పుణ్యాహవచనం, సుబ్రమణ్య హోమం, మొదటి కాల పూజ, విఘ్నేశ్వర పూజ, కాల యాగ పూజలు జరిపారు. ఈ రథోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై మిర్యాలు, బొరుగులు చల్లి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులతోపాటు పారిశ్రామిక వేత్తలు భక్తులకు అన్నదానం చేశారు. అలాగే భక్తులకు మజ్జిగ, తాగునీరు అందజేశారు.

వైభవం.. వైఖాసి విశాఖ ఉత్సవం