
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న
శశికుమార్
తమిళసినిమా: యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఇలా ఏ తరహా పాత్రనైనా పోషించి మెప్పించగల నటుడు శశికుమార్. ఈయన కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అయిన చిత్రం సుబ్రమణిపురం. 2008 జూలై 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత 2010లో ఈశన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత నటనపైనే దృష్టి సారించిన శశికుమార్ దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మళ్లీ దర్శకత్వం వహిస్తానని చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మధ్యలో ఈయన నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాదించలేదు. అలాంటిది ఆ మధ్య నటించిన అయోత్తి చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే విధంగా సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో బలమైన పాత్రను పోషించి ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణంగా నిలిచారు. కాగా తాజాగా శశికుమార్ ,సిమ్రాన్ జంటగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం నిర్మాణ కార్యక్రామలను పూర్తి చేసుకుని గురువారం తెరపైకి రానుంది.ఇది శ్రీలంక నుంచి ఒక కుటుంబం అక్రమంగా చెన్నకి చేరుకుని, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అన్న ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం. కాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నటుడు శశికుమార్ తదుపరి ఒక పిరియడ్ కథా చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు.ఈ చిత్ర షూటింగ్ను 2026 జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఒక పీరియడ్ కథను తయారు చేసి దాన్ని నటుడు విజయ్, సూర్యకు చెప్పానన్నారు. అయితే అది కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదని చెప్పారు. కాగా ఈ చిత్రం తరువాత ఆ కథను సరైన హీరో లభించినప్పుడు కచ్చితంగా తెరకెక్కిస్తానని శశికుమార్ చెప్పారు.