
వారసుడికి యువజన విభాగం పగ్గాలు
భారత రత్న ఇవ్వండి
సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్ దివంగత విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్కు డీఎండీకేలో యువజన పగ్గాలను అప్పగించారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఇక, తన సోదరుడు ఎల్కే సుదీష్కు పార్టీ కోశాధికారి పదవిని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అప్పగించారు. పార్టీ కార్యవర్గంలో మార్పులతో సర్వ సభ్య సమావేశం వేదికగా ఆమె ప్రకటించారు. విజయకాంత్ మరణానంతరం ఆయన లేని తొలి సర్వసభ్య భేటి ధర్మపురి వేదికగా బుధవారం జరిగింది. వివరాలు.. విజయకాంత్ మరణంతో తర్వాత గత ఏడాది అన్నాడీఎంకే కూటమితో ఎదుర్కొన్న లోక్సభ ఎన్నికలలో డీఎండీకే డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఐదు చోట్ల పోటీ చేసి సుమారు 3 శాతం ఓట్లను మాత్రమే ఆ పార్టీ రాబట్టుకోగలిగింది. అయితే, ఆయన వారసుడు విజయ ప్రభాకరన్ విరుదునగర్లో స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూడటం ఆ పార్టీ వర్గాలను తీవ్ర ఆవేదనలోకి నెట్టాయి. ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేని డీఎండీకే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం అయింది. పార్టీ బలోపేతం దిశగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ కసరత్తులు వేగవంతం చేశారు. విజయకాంత్ వారసుడైన విజయ ప్రభాకరన్ను పార్టీ పరంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ఇంత కాలం తల్లిదండ్రులకు అండగా పార్టీ కార్యక్రమాలో ఓకార్యకర్తగా పాల్గొంటూ వచ్చిన వారసుడికి ప్రస్తుతం అధికారికంగా పదవీ బాధ్యతలను అప్పగించారు.
యువజన నేతగా..
ధర్మపురి జిల్లాలోని పాలక్కోడులో డీఎండీకే రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. పార్టీ బలోపేతం, కేడర్తో మమేకమయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ, కెప్టెన్ విజయకాంత్ అభిమానుల్ని ఏకం చేస్తూ ముందుకు సాగేందుకు తీర్మానించారు. కెప్టెన్ ఆశయ సాధన నినాదంతో అసెంబ్లీ ఎన్నికలలోకి వెళ్లడానికి కార్యాచరణ రూపకల్పన చేశారు. పార్టీలో యువ రక్తాన్ని నింపేదిశగా వారసుడికి యువజన ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఈ సమావేశం ద్వారా అప్పగించారు. మంచి వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించే విజయ ప్రభాకరన్ ఇక పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించనున్నారు. యువజనులందరూ ఆయనకు అండగా నిలబడాలని, కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసుకుందామని ప్రేమలత విజయకాంత్ పిలుపు నిచ్చారు. విజయకాంత్ ధరించిన ఉంగరాన్ని ఈసందర్భంగా విజయ ప్రభాకరన్కు ఆమె తొడిగారు. అలాగే పార్టీ కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండవసారి ఎంపికై న ప్రేమలత విజయకాంత్ వ్యవహరిస్తారు. పార్టీ యువజన నేతగా ఇది వరకు ఉన్న ఆమె సోదరుడు ఎల్కే సుదీష్కు పార్టీ కోశాధికారి పగ్గాలను అప్పగించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్గా డాక్టర్ వీ ఇళంగోవన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పార్థసారధి, కార్యదర్శిగా అలగాపురం మోహన్ రాజులు, డిప్యూటీ కార్యదర్శులుగా పన్నీరు సెల్వం, సెంథిల్కుమార్, చంద్రన్, సుభా రవిని నియమించారు.
డీఎండీకేలో విజయ ప్రభాకరన్కు కీలక పదవి
సోదరుడికి కోశాధికారి పదవి
సినీ, రాజకీయ, సామాజిక, సేవా రంగాలలో అందరికి సుపరిచితుడైన విజయకాంత్కు భారత రత్న ఇవ్వాలని డీఎండీకే సర్వ సభ్యసమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈసందర్భంగా ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, కెప్టన్ కలలు, ఆశయ సాధన లక్ష్యంగా తమ పయనం కొనసాగుతందన్నారు. జనవరిలో కడలూరు వేదికగా పార్టీ మహానాడుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కూటమి గురించి నిర్ణయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తామన్నారు.