మీ అభిమానానికి దాసోహం.. అయితే! | - | Sakshi
Sakshi News home page

మీ అభిమానానికి దాసోహం.. అయితే!

May 1 2025 1:56 AM | Updated on May 1 2025 1:56 AM

మీ అభిమానానికి దాసోహం.. అయితే!

మీ అభిమానానికి దాసోహం.. అయితే!

● విజయ్‌ ఆవేదన

సాక్షి, చైన్నె : చూపిస్తున్న అభిమానానికి పులకించి పోతున్నాను...మీకు దాసోహం..అయితే, టీవీకే వర్గాల కొన్ని చర్యలు తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని అభిమానులను ఆ పార్టీ నేత, సినీ నటుడు విజయ్‌ సున్నితంగా మందలించారు. వివరాలు.. కోయంబత్తూరులో జరిగిన బూత్‌ కమిటీ మహానాడులో తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేత, నటుడు విజయ్‌ కోసం అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. వీరిని కట్టడి చేయడానికి ప్రైవేటు బౌన్సర్లను సైతం వినియోగించక తప్పలేదు. అయినా, విజయ్‌ను చూసేందుకు అభిమానులు వాహనాలలో దూసుకొచ్చారు. అత్యుత్సాహంతో వాహనాలపైకి ఎక్కి కేరింతలు కొట్టారు. విజయ్‌ కాన్వాయిని వెంబడించారు. ఇవన్నీ విజయ్‌కు కాస్త ఆవేదన కలిగించినట్టుంది. దీంతో అభిమానులు లెవ్వరు ఇక ఇలాంటి చర్యలకు పాల్పడ కూడదని పేర్కొంటూ సున్నితంగా మందలించే విధంగా, వారికి తన ఆజ్ఞ అన్నట్టుగా బుధవారం ప్రకటన చేశారు. టీవీకే వర్గాలు క్రమ శిక్షణతో కూడుకున్నవారు అని కితాబు ఇచ్చారు. కోయంబత్తూరు వేదికగా చూపించిన అభిమానం తనను పులకింతకు గురిచేసిందన్నారు. అభిమాన వర్షంలో తాను తడిచి ముద్దయినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో , ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ధ్యేయంగా 2026 ఎన్నికలలో గెలుపు కోసం ముందుకెళ్తున్నామన్నారు. ప్రజల కోసం టీవీకే అంటూ, ప్రజలకు ఆదర్శంగా కేడర్‌ నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, తనను చూడాలన్న కాంక్షతో తన వాహనంను వెంబడిస్తూ కేడర్‌ ద్విచక్ర వాహనాలలో దూసుకు రావడం తనలో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపిన వారిని చూసి కలవరం చెందినట్టు పేర్కొన్నారు. వాహనాల మీదకు ఎక్కి సాహసం చేసే రీతిలో దూసుకు రావడం తనలో భయాన్ని రేపిందన్నారు. తన కేడర్‌, తన అభిమానులు ఇక మీదట ఇలాంటి చర్యలకు పాల్పడ కూడదనే తాను ఈసందేశాన్ని ఓ ఆజ్ఞగా సూచిస్తున్నట్టు వివరించారు. ఇక మీదట ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని, క్రమశిక్షణగా మెలుగుదామని, ఇతర పార్టీల వారికి సైతం ఆదర్శంగా ఉందామని పిలుపు నిచ్చారు.

విజయ్‌కు గాలం..

కోయంబత్తూరులో విజయ్‌ కోసం పోటెత్తిన జన సందోహం సమాచారం ఢిల్లీకి చేరింది. డీఎంకేకు వ్యతిరేక ఓట్లు విజయ్‌ కారణంగా ముక్కలు కాకుండా అన్ని ఒకే కూటమికి పడే రీతిలో బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్‌డీఏ కూటమిలోకి విజయ్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ వద్ద విజయ్‌కు వస్తున్న ఆదరణ సమాచారాన్ని అమిత్‌ షా రాబట్టినట్టు, విజయ్‌ను తమ దారిలోకి తెచ్చుకునే విధంగా గాలం వేయబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంగా నైనార్‌ను మీడియా ప్రశ్నించగా, టీవీకేతో బీజేపీ మంతనాలు అన్న విషయం తనకు తెలియదన్నారు. ఎన్నికలకు సమయం ఉందని, ప్రస్తుతానికి తాను కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ, అన్నీ మంచే జరుగుతాయని పేర్కొనడం గమనార్హం. విజయ్‌ పార్టీ వర్గాలు పేర్కొంటూ ఇందుకు ఆస్కారమే లేదని విజయ్‌ ఒంటరిగా నైనా తన బలాన్ని చాటుకుంటారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement