
వేంబు చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు
తమిళసినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. అందుకు తగ్గట్టు కథ, కథనాలు, నటీనటుల ప్రతిభ చాలా అవసరం. అలాంటిది వేంబు చిత్రం విడుదలకు ముందుగానే అహమదాబాద్లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటి,ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. మంజల్ సినిమాస్ పతాకంపై గోల్డెన్ సురేశ్,ఎస్.విజయలక్ష్మి కలిసి నిర్మించిన చిత్రం వేంబు. నవ దర్శకుడు వీ. జస్టిన్ ప్రభు తెరకెక్కించిన ఇందులో నటుడు హరికృష్ణన్, నటి షీలా జంటగా నటించారు. మారిముత్తు,జయరావ్, పరియేరుమ్ పెరుమాళ్ కర్ణన్,వాళై చిత్రం ఫేమ్ జానకి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.కుమరన్ ఛాయాగ్రహణం, మణికంఠన్ మురళీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఇది మహిళల ఇతి వృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. సీ్త్ర తనను తాను కాపాడుకోవడంతో పాటూ మానవ మృగాల మధ్య ఎలా ధైర్యంగా జీవించాలి అన్న కథాంశంతో కూడిన ఈ చిత్రానికి ఇటీవల జరిగిన అహ్మదాబాద్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేటి సమాజానికి సంబంధించిన ముఖ్య అంశం గురించి చిర్చించిన తమ చిత్రానికి అంతర్జాజాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు లభించడం సంతోషంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఇది త్వరలో తెరపైకి రానున్న వేంబు చిత్రానికి మరింత బలం చేకూర్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.
ఉత్తమ నటి అవార్డును
అందుకుంటున్న నటి షీలా