
కోవై వేదికగా వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్
సాక్షి, చైన్నె: తమిళనాడు ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ నేతృత్వంలో కోయంబత్తూర్లో జరగనున్న ‘‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025’’ లోగోను శనివారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విభాగం ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025‘లోగో, ప్రత్యేక వెబ్ సైట్ను డీప్యూటీ సీఎం ఉదయనిధి సచివాలయంలో ప్రారంభించారు. పారిశ్రామికంగా తమిళనాడును భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా, యువత కొత్త వ్యాపారాల కల్పన, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన విస్తృతం చేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. 2021లో తమిళనాడులో 2,032 పరిశ్రమలు ఉండగా, ప్రస్తుతం నాలుగు రెట్లు అధిగమించి 10,800కి సంఖ్య చేరిందని వివరించారు. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా జరుగుతున్న కార్యాచరణలో భాగంగా గత 4 సంవత్సరాలలో చైన్నె, మధురై, ఈరోడ్, తిరునెల్వేలి, హోసూరు, సేలం, కడలూరు, తంజావూరు, కోయంబత్తూరు, తిరుచ్చి వంటి పది నగరాలను ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దామని వివరించారు. తమిళనాడులోని వినూత్న సంస్థలను ప్రపంచ స్థాయికి చేర్చడం కోసం కోయంబత్తూరులోని కోడిసియా మైదానంలో సమ్మిట్ ఏర్పాటు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి, ఆవిష్కరణల వేదికకు వివిధ ప్రాంతాలలోని స్టార్టప్, పెట్టుబడి దారులు, విశ్వవిద్యాలయాలలోని ప్రతినిధులు, ఆవిష్కరణ కర్తలు 30 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికత, వాతావరణ మార్పు నిర్వహణ, విద్యుత్ వాహన సాంకేతికత, వ్యవసాయం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు , ఇతర వినూత్న కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద కార్పొరేషన్లు , వ్యాపార ఇంక్యుబేటర్లతో 750 స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇందులో పాల్గొనే వారి పేర్ల నమోదు కోసం ఆన్లైన్లో వెబ్ సైట్ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, కార్యదర్శి అతుల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.