‘అప్పు’ పేరిట వేధిస్తే.. మూడేళ్లు జైలు! | - | Sakshi
Sakshi News home page

‘అప్పు’ పేరిట వేధిస్తే.. మూడేళ్లు జైలు!

Apr 27 2025 12:59 AM | Updated on Apr 27 2025 12:59 AM

‘అప్పు’ పేరిట వేధిస్తే.. మూడేళ్లు జైలు!

‘అప్పు’ పేరిట వేధిస్తే.. మూడేళ్లు జైలు!

సాక్షి, చైన్నె: మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాల ప్రజలను అప్పుల వసూళ్ల పేరిట వేధించే వారి భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షలు జరిమానా విధించే విధంగా చట్ట సవరణ ముసాయిదాను అసెంబీలలో శనివారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ దాఖలు చేశారు. అలాగే, పొరుగు రాష్ట్రాల నుంచి గానీ, ఏదేని ఆస్పత్రుల నుంచి గానీ వైద్య వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ పడేసిన పక్షంలో విచారణ అన్నది లేకుండా జైలు శిక్ష విధించే రీతిలో గుండా యాక్ట్‌ ప్రయోగానికి మరో ముసాయిదాను సభలో న్యాయ మంత్రి రఘుపతి దాఖలు చేశారు. వివరాలు.. అసెంబ్లీ సమావేశాలలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఎం. సుబ్రమణియన్‌ మాట్లాడుతూ,పదిరోజులలో సిద్ధ, ఆయుర్వేద విభాగంలో ఖాళీగా ఉన్న 121 పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించారు. మంత్రి గీతాజీవన్‌ మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ శాఖలోని 7997 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, సిగరేట్‌ లైటర్‌లపై నిషేధం విధించే విధంగా పరిశీలన చేస్తున్నామన్నారు. కోయంబత్తూరు బైపాస్‌ రోడ్డు పనులు త్వరితగతిన ముగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఏవీ వేలు తెలిపారు. చైన్నె తిరువీకానగర్‌ మండలంలో 16 చోట్ల విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు. కాగా అన్నాడీఎంకే సభ్యుడు అరక్కోణం రవి సభలో చేతులు పైకి ఎత్తిఎత్తి నొప్పి వస్తున్నట్టు, బటన్‌ సిస్టమ్‌ పెట్టాలంటూ వ్యంగ్య్రాస్త్రం సంధించడంతో స్పీకర్‌ అప్పావు క్లాస్‌ పీకారు. మంత్రి దురై మురుగన్‌ స్పందిస్తూ సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యంగాస్త్రాలు వద్దంటూ హితవు పలికారు.

రఘుపతి ముసాయిదా..

అసెంబ్లీలో వైద్య వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ పడేయడం, పొరుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోకి తీసుకొచ్చి పడేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా సభలో న్యాయమంత్రి రఘుపతి ముసాయిదాను దాఖలు చేశారు. వాస్తవానికి ఈముసాయిదా మంత్రి సెంథిల్‌ బాలాజీ దాఖలు చేయాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తమ మీదున్న కేసు విచారణ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఆయన ముసాయిదా దాఖలు చేయలేదు. ఆయన తరపున రఘుపతి దాఖలు చేశారు. వైద్య సంభంధిత వ్యర్థాలను తీసుకొచ్చి పడేస్తే ఇక గుండాయాక్ట్‌ కింద, విచారణ లేకుండా శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు. కాగా సెంథిల్‌బాలాజీ ముసాయిదా దాఖలు చేయని దృష్ట్యా, ఆయన మంత్రి పదవి రాజీనామా చేయబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. ఇప్పటికే మనీ లాండరింగ్‌ కేసులో బెయిలా? మంత్రి పదవినా? అని సుప్రీంకోర్టు ఆయన్ను ప్రశ్నించడం విధితమే.

మాజీలకు పెన్షన్‌ పెంపు

అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేల పెన్షన్‌, కుటుంబ భత్యం, వైద్య భత్యం పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ పెంపునకు సంబంధించి ఇప్పటికే అనేక విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇక ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మాజీ శాసన సభ్యులు, పూర్వపు కౌన్సిల్‌ సభ్యులకు నెలవారీగా ఇస్తున్న పెన్షన్‌ ను రూ. 30 వేల నుంచి రూ. 35 వేలుగా పెంచుతున్నామని ప్రకటించారు. అలాగే కుటుంబ పెన్షన్‌ రూ. 15 వేల నుంచి రూ. 17,500లుగా, వార్షిక వైద్య ఖర్చు రూ. 75 వేల నుంచి రూ. లక్షకు పెంచుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా సభలో నుంచి సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ లేచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ సీటును ఆయన దాటుతుండగా కాళ్లు మెలిక పడ్డట్టుగా కింద తూలి పడ్డారు. అదే సమయంలో సభలోకి వచ్చిన డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రి ఏవీ వేలు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ ఆయన కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. తన సీటు వద్దకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ దృష్ట్యా, సభలో కాసేపు ఉత్కంఠ నెలకొంది.

రూ. 5 లక్షల జరిమానా

వైద్య వ్యర్థాలను పడేస్తే గుండాయాక్ట్‌

అసెంబ్లీలో ముసాయిదా దాఖలు

మాజీ ఎమ్మెల్యేల పింఛన్‌ పెంపు

సభలో తూలిపడ్డ దురై మురుగన్‌

సభకు ముసాయిదాలు..

ప్రశ్నోత్తరాల అనంతరం సభలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ప్రత్యేక ప్రసంగంతో ముసాయిదాను దాఖలు చేశారు. అప్పులు ఇచ్చే సంస్థలు, తీసుకునే వారి పరిస్థితులు, బలవంతంగా వసూలు గురించి వివరించారు. ఈ బలవంతపు వసూళ్లు ఆత్మహత్యను ప్రేరేపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాల ప్రజలు చేసే అప్పులు, తీసుకునే రుణాల విషయంలో వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని , అందుకే ఈ చట్ట సవరణ ముసాయిదా అని ప్రకటించారు. అప్పుల వసూళ్ల పేరిట వేధిస్తే ఇక మూడేళ్లు జైలు శిక్ష , రూ. 5 లక్షలు జరిమానా విధించడం జరుగుతుందని ప్రకటించారు. బలవంతంగా వసూళ్లు, వేధింపునకు గురై ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత వ్యక్తులు (అప్పు ఇచ్చినవారు), సంస్థలపై నాన్‌ బెయిల్‌ వారెంట్‌ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులను వేదించినా, బెదిరించినా, వెంటాడినా, బలవంతంగాఆస్తులను జప్తు చేసినా, పై శిక్షలు వర్తించబడుతాయని ప్రకటించారు. అయితే, ఈ ముసాయిదాలో కొన్ని సవరణలు చేయాలని అన్నాడీఎంకేతో పాటుగా కొన్ని పార్టీలు ప్రభుత్వానికి సూచించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement