
ముదుమలైలో ఉప రాష్ట్రపతి
– ఏనుగులకు ఆహారం పంపిణీ
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లా పరిధిలో ముదుమలై రిజర్వు పారెస్టు ఉన్న ఏనుగుల సంరక్షణా శిబిరాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం సందర్శించారు. ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ వేదికగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి నేతృత్వంలో వీసీల మహానాడు శుక్ర, శనివారాలలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు రెండవ రోజుగా వీసీలు గైర్హాజరయ్యారు. సెంట్రల్ వర్సిటీ, ప్రైవేటు వర్సిటీల ప్రతినిధులతో ఈమహానాడును ముగించారు. ఈ మహానాడు నిమిత్తం ఊటీకి వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ముదుమలై రిజర్వు ఫారెస్టులోని ఆసియాలోనే అతి పెద్దదిగా పేరుగడించిన తెప్పకాడు ఏనుగుల సంరక్షణా శిబిరం ను సందర్శించారు. ఊటీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయన అక్కడి ఏనుగులకు ఆహారం పంపిణి చేశారు. ఏనుగు మావటీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కాగా, ఈ తెప్పకాడును ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పీఎం మోదీలు సందర్శించిన విషయం తెలిసిందే. ఎలిపెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచ గుర్తింపు పొందిన గున్న ఏనుగు పర్యవేక్షకులైన బొమ్మన్, బెల్లి దంపతులకు తమ అభినందనలు, ఆశీస్సులను వీరు అందజేశారు.
160 స్థానాలపై పళణి గురి
సాక్షి, చైన్నె: రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 160 స్థానాలలో పోటీ చేయడానికి అన్నాడీఎంకే వ్యూహ రచన చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లాల కార్యదర్శుల సమావేశంలో పట్టున్న నియోజకవర్గాల పై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీతో మళ్లీ కూటమి తదుపరి తొలిసారిగా శుక్రవారం సాయంత్రం నుంచి పొద్దు పోయే వరకు అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం చైన్నెలోని పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీపరిస్థితుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.ఆ పార్టీ బలోపేతం, పళణి రాష్ట్రపర్యటన కార్యాచరణ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంల్నో 234 స్థానాలలో 160 స్థానాలలో అన్నాడీఎంకే పోటీ చేయడమే లక్ష్యంగా జిల్లాల కార్యదర్శుల భేటిలో నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. మిగిలిన స్థానాలను తమతో కలిసి వచ్చే బీజేపీ తదితర పార్టీలకు కేటాయించబోతున్నారు. 160లో 120 నుంచి 140 స్థానాలలో గెలుపు దిశగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయనున్నారు. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్గా 117 స్థానాలు అవసరం. దీనిని దాటితే చాలు సంపూర్ణ మెజారిటీతో ఎవ్వరికి వాటా అన్నది ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడిపేందుకు అవకాశం ఉంటుందని నేతలు ఇచ్చిన సూచనతో తమకు పట్టున్న స్థానాలపై దృష్టి పెట్టే దిశగా కార్యాచరణను పళణి స్వామి సిద్ధం చేసి ఉండడం గమనార్హం. పళణి పర్యటనలన్నీ ఈ 160 అసెంబ్లీ నియోజకవర్గాల చుట్టూ సాగబోతోంది. ఇక్కడున్న నేతలను మరింతగా పరుగులు తీయించే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ద్విచక్ర వాహనాలు ఢీ
● ఆంధ్రాకు చెందిన వ్యక్తి మృతి
● నలుగురికి గాయాలు
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలో జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రాలోని నగరికి చెందిన వ్యక్తి మృతి చెందగా అతని ఇద్దరు కుమారులు, మరోబైకులో వచ్చిన వ్యక్తితో పాటూ అతనితో పాటు వెళ్లిన చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథనం మేరకు ఆంధ్రాలోని నగరికి చెందిన మునివేల్(45) అతని కొడుకులు భరిణి(10), రూపేష్(8) ముగ్గురు శనివారం సాయంత్రం తిరుత్తణికి వచ్చి ద్విచక్ర వాహనానికి డ్యూ చెల్లించి ఇంటికి వెళ్తుండగా నాగలాపురానికి చెందిన ప్రశాంత్(35) అతని మిత్రుడి కుమారుడు అమర్నాథ్(10)తో కనకమ్మసత్రానికి వెళ్లారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో పొన్పాడి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి,. ప్రమాదంలో మునివేల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని ఇద్దరు కుమారులతో పాటూ మరో బైకులో వెళ్లిన ప్రశాంత్, అమర్నాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ముదుమలైలో ఉప రాష్ట్రపతి

ముదుమలైలో ఉప రాష్ట్రపతి