
వ్యక్తి అనుమానాస్పద మృతి
కంభం: మద్యం తాగి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక కాప వీధిలో జరిగింది. వివరాలు.. అర్థవీడుకు చెందిన షేక్ వలి (45) కంభం పంచాయతీ పరిధి సాధుమియా వీధిలో వివాహం చేసుకొని భార్యతో కలిసి కొంతకాలంగా కాప వీధిలో నివాసం ఉంటున్నాడు. పెయింటింగ్, ఇతర కూలి పనులకు వెళ్లే వలి మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవపడే వాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన అతను నిద్రపోయాడని, చీకటి పడుతున్నా లేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం తాగిన అతను డీహైడ్రేషన్తో మృతి చెందాడా? ఇంకా ఏదైనా కారణంతో మృతి చెందాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.