ఒంగోలు టౌన్: దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసు కీలక దశకు చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ హత్యకు సంబంధించి రోజుకో రకంగా కథనాలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. పోలీసు బృందాలు పొరుగు రాష్ట్రాలతో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీలక నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు వీరయ్య చౌదరి హత్య జరిగింది. దాదాపు పదిరోజులు అవుతోంది. ఇంకా కీలక నిందితుల ఆచూకీ లభించకపోవడం గమనార్హం. అయితే వారి బంధువుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారని తెలుస్తోంది.
12 మంది విచారణ
ఇప్పటి వరకూ ఈ కేసులో దాదాపు వంద మందికి పైగా అనుమానితులను, నిందితుల బంధువులు, స్నేహితులు, హత్యకు గురైన వీరయ్యచౌదరి సన్నిహితులను, ఆయన స్వగ్రామానికి చెందిన పలువుర్ని పోలీసులు విచారించారు. అయితే నగర డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాత్రి 11 వరకు కూడా ఎస్పీ ఏఆర్ దామోదర్ దాదాపు 12 మందిని విచారించినట్టు సమాచారం. హత్యలో పాల్గొన్న కీలక నిందితుల బంధువులను, మిత్రులతో పాటు పలువురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారించినట్టు తెలిసింది. అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన అనుమానితుడి తల్లిదండ్రులతో పాటుగా అతడి సోదరుడిని విచారించినట్లు సమాచారం. అలాగే నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి చెందిన ఒక నాయకుడిని, చినగంజాంకు చెందిన ఒక ఎంపీటీసీని కూడా విచారించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఒక పోలీస్స్టేషన్ సమీపంలో ఉన్న కార్షాపీకి రోజూ ప్రధాన అనుమానితుడు వస్తుంటాడని, అక్కడి వారితో కలిసి హత్యకు ముందు భోజనం చేశాడని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్షాపీ మిత్ర బృందంలోని ఐదుగురిని విచారించినట్లు సమాచారం. ఒంగోలు మండలంలోని వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఒక గృహప్రవేశం సందర్భంగా ప్రధాన అనుమానితుడితో కలిసి ఫొటో దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో అతడిని కూడా విచారణకు పిలిపించారని తెలిసింది. వారితో పాటుగా హత్యతో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలు వ్యక్తి అక్కా బావలను విచారించినట్లు సమాచారం.
రోజుకో చోట భోజనం...
వీరయ్య హత్య కేసులో నిందితులు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ఒక లాడ్జీలో ఉండి పది రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరగడం తెలిసిందే. అయితే నిందితులకు ప్రతి రోజు భోజనం తీసుకెళ్లి ఇచ్చినట్లు కొప్పోలు నిందితుడి బావమరిది అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది. అయితే నిందితులు నేరుగా లాడ్జికి భోజనం తీసుకొని రాకుండా రోజుకో చోటకు తీసుకొని రమ్మని చెప్పేవారని సదరు వ్యక్తి పోలీసులకు వివరించినట్టు సమాచారం. అలాగే నిందితుల గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది.
వీరయ్య చౌదరి హత్యకేసులో నెల్లూరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం ఒకే రోజు డీఎస్పీ కార్యాలయంలో 12 మందిని విచారించిన ఎస్పీ కీలక నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు
నెల్లూరులో ఇద్దరిని అదుపులోకి..
వీరయ్య హత్యలో నలుగురు పాల్గొన్నారని పోలీసులు మొదట నుంచి చెబుతున్నారు. అయితే స్కూటీ క్లూ తరువాత పాత్రధారులంతా ఒంగోలు, పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని ప్రచారం జరిగింది. ఇప్పుడు నెల్లూరుకు చెందిన యువకులకు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు చెప్పుకుంటున్నారు. బుధవారం నెల్లూరులో ఇద్దరు పాత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు అసలు నిందితులు కాదని, హత్య జరిగిన తరువాత జరిగిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసు అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించకపోవడం గమనార్హం.