
సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి
ఒంగోలు టౌన్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైగా పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అనుబంధ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీహెచ్ఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. అనంతరం కాలం సుబ్బారావు మాట్లాడుతూ.. బీఎస్సీ నర్సింగ్ నుంచి పీహెచ్డీ వరకు ఉన్నత చదువులనభ్యసించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు. సీహెచ్ఓల చేత నిర్ధిష్టమైన పనులు చేయించకుండా అడ్డగోలు పనులన్నీ చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్ఓల పీఎఫ్ సౌకర్యాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గత సంవత్సరం కాలంగా ఇంక్రిమెంట్లు, అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్నామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్ చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు ఏ.నిర్మల, జీవన జ్యోతి, ప్రసన్న, సయ్యద్ గౌస్ పాల్గొన్నారు. జిల్లాలోని 538 మంది సీహెచ్ఓలు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
మోకాళ్లపై నిరసన తెలిపిన సీహెచ్ఓలు రెండో రోజుకు చేరిన సీహెచ్ఓల నిరవధిక సమ్మె