
‘కంది’పోయిన సంక్షేమం
ఒక్కో సంక్షేమ పథకాన్నీ ఎత్తేస్తున్న కూటమి ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పునకూ మంగళం పాడింది. గత నాలుగు నెలలుగా రేషన్షాపుల్లో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే నెల కోటాలోనూ కందిపప్పు రాకపోవడంతో ఈనెల కూడా వాటి సరఫరా లేనట్లే. మరోవైపు ఈకేవైసీ కాలేదన్న నెపంతో రేషన్ లబ్ధిదారులకు పెద్ద ఎత్తున కోత పెడుతోంది. రాజధాని పేరుతో నిధులన్నీ అమరావతిలో కుమ్మరిస్తూ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రజలు మండిపడుతున్నారు.
బేస్తవారిపేట: కూటమి సర్కారు పాలనలో రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేసే కందిపప్పునకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో రేషన్ డిపోల ద్వారా అన్ని రకాల పప్పులు రాయితీ ధరలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు ఇవ్వలేకపోతున్నారు. బియ్యం తప్ప రెండో సరుకు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తూ అరకొరగా రావడంతో మొదట వచ్చిన వారికే అందేది. ప్రస్తుతం కందిపప్పు సరఫరాకు పూర్తిగా మంగళం పాడేశారు. ఈనెల కూడా గోదాములకు కందిపప్పు రాలేదు. పంచదార, బియ్యం రేషన్ దుకాణాలకు గోడౌన్ల నుంచి సరఫరా చేశారు. కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కేజీ రూ.130–రూ.150 ఉంది. దీంతో రేషన్ దుకాణాల్లో కందిపప్పునకు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం రేషన్కార్డుపై కిలో రూ.67 కు అందిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోనే నిధులన్నీ ఖర్చుపెడితే పేదల కడుపు నిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. బడాబాబుల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లో వేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో మొత్తం ప్రభుత్వ రేషన్ దుకాణాలు 1,392, రేషన్కార్డులు 6,76,160 ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఆయిల్, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఈకేవైసీ గండం...
జిల్లాలోని 38 మండలాల్లో 19,37,977 మందికి ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటికి 17,93,769 మంది చేయించుకున్నారు. ఇందులో 0–5 ఏళ్లలోపు పిల్లలు 18,861, 80 ఏళ్ల పైబడినవారు 1830 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రెస్లో 85,355 మంది ఉన్నారు. 1,23,517 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు ఉన్నారు. వీరందరికీ మే నెలలో రేషన్ అందే పరిస్థితి లేదు.
రేషన్ లబ్ధిదారులకు నాలుగు నెలలుగా నిలిచిన కందిపప్పు సరఫరా మే నెలకు కూడా విడుదలకాని కందిపప్పు కోటా కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కార్డుదారులు లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా జిల్లాలో రేషన్కార్డుల సంఖ్య 6,76,160 ఈ కేవైసీ చేయించుకోని 1,23,517 మందికి మే నెల రేషన్ లేనట్లే !
మే నెల కందిపప్పు రాలేదు
రేషన్కార్డుదారులకు మే నెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం.
– సూరా రామనారాయణరెడ్డి, రేషన్ డీటీ