
కోటాలో కోత..!
నియోజకవర్గంలో రేషన్ కార్డులు
21
86000
1,200
టన్నులు
ఆరు మండలాల్లో
రేషన్ షాపులు
రేషన్ పంపిణీ వాహనం
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వం పేదలపై కక్ష కట్టింది. గతంలో ఇస్తున్న పథకాలన్నింటినీ అటకెక్కించిన ప్రభుత్వం..ఇప్పుడు తాజాగా రేషన్ బియ్యంలోనూ కోత విధించింది. ప్రతి నెలా జిల్లాకు మంజూరయ్యే రేషన్ బియ్యం కోటాలో కోత పెట్టింది. ఒక్కసారిగా బియ్యం తక్కువ రావడంతో డీలర్లు ఆందోళన చెందారు. గత మూడు నెలల్లో జరిగిన బియ్యం పంపిణీని సగటుగా తీసుకోవడంతో పాటు మార్చి క్లోజింగ్ బ్యాలెన్స్ తీసి వేసి ఏప్రిల్కు బియ్యం కోటా మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో వాస్తవ అలాట్మెంట్ కంటే దాదాపు 30 శాతం తగ్గించినట్లు వచ్చినట్లు తెలిసింది. 100 క్వింటాళ్లకు కేవలం 70 క్వింటాళ్లకు మాత్రమే రేషన్ దుకాణాలకు కేటాయించింది. అయితే ఈ విషయమై ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. బియ్యం కోటా తక్కువగా రావడంతో డీలర్లు విచారించినా దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు.
తమ్ముళ్లలో ‘పరేషాన్’
ఏప్రిల్ నెల బియ్యం కోటాలో కోత విధించడంతో రేషన్ డీలర్లుగా ఉన్న తమ్ముళ్లు పరేషాన్కు గురయ్యారు. వాస్తవానికి ప్రతి రేషన్ డీలర్ సుమారు 30 శాతం వరకు మిగుల్చుకుంటారు. 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం కేటాయిస్తే అందులో 70 నుంచి 75 శాతం మాత్రమే వాస్తవ పంపిణీ చేస్తారు. 10 నుంచి 15 శాతం మందికార్డులకు బియ్యం ఆయిపోయాయంటూ బియ్యానికి బదులు నగదు ఇచ్చి థంబ్ వేయించుకుంటారు. ప్రతి షాపులో కనీసం 20 శాతం సరుకు నిల్వలు ఉంటాయి. ప్రతి నెలా ప్రభుత్వానికి సేల్స్ అండ్ స్టాక్పై నివేదికలు ఇవ్వాలి. కానీ డీలర్లు మిగిలిన బియ్యాన్ని కేజీ రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఈ నెలలో రావాల్సిన బియ్యం కోటాలో 30 శాతం తక్కువ రావడంతో డీలర్లు ఏం చేయాలో ఆందోళన చెందారు. తగ్గిన బియ్యం కోటాను ఎలా పంపిణీ చేయాలో, ఎలా మిగుల్చుకోవాలో తెలియక తికమకపడ్డారు. కోటా కోతలో కొన్ని చోట్ల ఎండీయూ ఆపరేటర్లను, డీలర్లను కార్డుదారులు నిలదీసిన సంఘటనలూ ఉన్నాయి. . దీంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి 10 శాతం అదనంగా కేటాయించి కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేశారు. అయితే ఎక్కడా సమస్య బయటకు రాకుండా అధికారులు, డీలర్లు, అధికార పార్టీ నేతలు గప్చుప్గా వ్యవహారం నడిపించారు. కనిగిరిలో సుమారు 20 దుకాణాల వారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల అనుమతితో అదనంగా 10 శాతం బియ్యాన్ని కేటాయించుకొని పంపిణీ చేసినట్లు సమాచారం.
అధికారులు, డీలర్ల మధ్య వార్...
30 శాతం తక్కువ కోటా కేటాయించడంపై డీలర్లు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 95 శాతం రేషన్ దుకాణాలను లాగేసుకొని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటాయించింది. ఏళ్ల తరబడి రేషన్ దుకాణం నిర్వహిస్తున్న వారి వద్ద కూడా నిర్దాక్ష్ణ్యింగా లాక్కున్నారు. ప్రస్తుతం అధిక శాతం మంది డీలర్లు కూటమి నేతలే కావడంతో వారంతా అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో వచ్చే నెలలో గతంలో కేటాయించిన విధంగానే అలాట్మెంట్ చేస్తామని చెప్పి సర్దిచెప్పి పంపించారు.
కేటాయింపు ఇలా..
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న రెండు ఎఫ్సీఐ గోడౌన్ల పరిధిలో ఏప్రిల్ నెల రేషన్ బియ్యం సరఫరాలో సుమారు 300 టన్నులు తగ్గించినట్లు తెలిసింది. కనిగిరి ఎఫ్సీఐ పరిధిలోని నాలుగు మండలాల రేషన్ షాపులకు 650 టన్నులకు 530 టన్నుల కేటాయించగా, పామూరు గోడౌన్ పరిధిలోని పామూరు, సీఎస్పురం మండలాల రేషన్ కార్డులకు సంబంధించి 520 టన్నులకు గాను 350 టన్నులు కేటాయింపులు చేసినట్లు సమాచారం.
రెండు ఎఫ్సీఐ గోడౌన్ల పరిధిలో రేషన్ బియ్యం సరఫరా
బియ్యం కోటాలో కోత విధించిన ప్రభుత్వం
కార్డుదారులందరికీ అందని బియ్యం
ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న రేషన్డీలర్లు
తక్కువ బియ్యం రావడంతో అక్రమార్కులకు తగ్గిన వాటా
ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు
కోతలు లేకుండా రేషన్ను
అందజేయాలి:
కూటమి ప్రభుత్వంలో అన్నింటిలో కోతలు పెడుతున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యంలోనూ కోత విధించడం దారుణం. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 300 టన్నులకు పైగా కోత విధించారు. ప్రభుత్వం విధానం మార్చుకోకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
– పందిటి మోహన్,
డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి)