
మంత్రి బొత్స మాట్లాడుతూ, శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తమ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన: మంత్రి బొత్స
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తోంది. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్ అని మంత్రి ప్రశ్నించారు. ‘‘బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు లేవు. బీజేపీ నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన’’ అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు.
సీతంరాజు సుధాకర్ గెలుపునకు కృషి చేయాలి: వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ను అధిష్ఠానం నిర్ణయించిందని పేర్కొన్నారు. నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించామన్నారు. సీతంరాజు సుధాకర్ గెలుపునకు అందరూ కృషి చేయాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్రకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత: మంత్రి ధర్మాన
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రకు కార్యనిర్వాహణ రాజధాని వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేధావులైన గాడ్యుయేట్స్ ఆలోచించి ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపును విపక్షాలు నిలువరించలేవని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.
చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..