
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసే వరకు ఉద్యమం
● కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన ● కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
విజయనగరం అర్బన్: ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రధాన డిమాండ్తో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. స్థానిక కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు నిరసనలు తెలుపుతూ కదం తొక్కారు. నిరసనలో ఉపాధ్యాయులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్జీటీల బదిలీలను మాన్యువల్లో నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్లకార్డుతో నిరసన

వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసే వరకు ఉద్యమం