నకరికల్లు: నర్శింగపాడులోని శ్రీ గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో లక్ష బిళ్వార్చన వేడుకలు బుధవారం కనుల పండువలా సాగాయి. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజాధికాలు జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకాలు చేశారు. చండీపారాయణం, రుద్రహోమం, చండీహోమం, అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు.
బగళాముఖి ఆలయానికి ఐఎస్ఓ 9001 అవార్డు
చందోలు(కర్లపాలెం): చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయానికి హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డు రావటం బాపట్ల జిల్లాకే తలమానికమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆలపాటి శివయ్య ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హైమ్ ఇంటర్నేషనల్ ఐఎస్వో 9001 అవార్డును ఆలయ మేనేజర్ నరసింహమూర్తికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ చందోలు బగళాముఖి అమ్మవారి చరిత్ర తెలుసుకుని అవార్డు అందజేశామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు, ఆలపాటి శివయ్యలను ఆలయ మేనేజర్, అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు పట్టాభిరామారావు, ప్రసాద్, ఆలయ అర్చకులు ఉన్నారు.
నువ్వులు, వేరుశనగల దిగుబడి పెంపునకు శిక్షణ
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ ఆర్థిక సహకారంతో బుధవారం లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మి మాట్లాడుతూ నువ్వులు, వేరుశనగ పంటల్లో దిగుబడిని పెంచే దిశగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందన్నారు. రైతులు నూనె గింజల పంటలను విరివిగా చేపట్టి భారతదేశ వంటనూనెల దిగుమతులను తగ్గించాలని కోరారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ శివన్నారాయణ వేరుశనగలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్ళు యాజమాన్యం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకునే విధానాలు వివరించారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
పెదకాకాని: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం విజయవాడకు చెందిన తిరుక్కోవల్లూరి సాంబమూర్తి పేరు మీద వారి సతీమణి శోభ రూ. 50,116 అందజేశారు. అలానే గుంటూరుకు చెందిన నందిగామ సాంబశివరావు, నర్రా రామమూర్తి, గింజుపల్లి గోపాల్స్వామిల పేరు మీద నందిగామ శిరీష, ప్రసాద్రెడ్డి దంపతులు దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు.
చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు
చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు
చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు


