వైద్యశాఖ మంత్రిని సత్వరమే మార్చండి
● పాడేరు వైద్య కళాశాలకు సీట్లు రాకపోవటానికి ప్రభుత్వం, మంత్రి నిర్లక్ష్యమే కారణం
● గిరిజనుల వైద్యాన్ని పట్టించుకోని చంద్రబాబు సర్కార్
● వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ● గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి సులభంగా వైద్య సౌకర్యాలు అందజేసే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. దీనిని పూర్తిచేసి 50 సీట్లతో ప్రారంభించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది మళ్లీ ఆ కళాశాలకు సీట్లు కేటాయించేందుకు ఎన్ఎంసీ నిరాకరించిందన్నారు. ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు పరీక్షలు, సర్టిఫికెట్లు ఏవిధంగా అందజేస్తారంటూ చిన్న క్లారిఫికేషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్ఎంసీ కోరితే.. సకాలంలో మంత్రి, అధికారులు స్పందించి తగిన జవాబు పంపని కారణంగా ఎన్ఎంసీ సీట్లు నిరాకరిస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఇది చాలా దారుణమైన అంశమని పేర్కొన్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను వంద శాతం పూర్తిచేసి దానికి కావాల్సిన పరికరాలు సైతం గత ప్రభుత్వం సమకూర్చిందన్నారు. చంద్రబాబు సర్కార్ ఆ కళాశాలకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లేఖ రాయటంతో పాటు సమకూర్చిన పరికరాలను వేరే ప్రదేశానికి తరలించటం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు.
నరసరావుపేట: గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాడేరు మెడికల్ కళాశాలకు ఈ ఏడాది 50 సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిరాకరించటం బాబు సర్కారు తీరుకు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నరసరావుపేటలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఆ పదవి నుంచి తొలగించి బాధ్యత గల వ్యక్తికి ఆరోగ్యశాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సైతం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
వైద్యుల్ని సైతం మోసం చేసిన మంత్రి
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తన మంత్రిత్వ శాఖపై పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారని, పీహెచ్సీ వైద్యులను సైతం మోసం చేశారని గోపిరెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్లు చెల్లించాలని కోరుతూ సమ్మెకు దిగితే కేవలం రూ.250 కోట్లు చెల్లించి చేతులు దులుపుకొన్నారన్నారు. గత ప్రభుత్వం పూర్తిచేసి ప్రారంభించిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు.