
ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చిన జీఎస్టీ
● సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సుజిత్ మల్లిక్ ● ఘనంగా జీఎస్టీ దినోత్సవం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : జీఎస్టీతో దేశం ప్రగతి పథంలో దూసుకువెళుతుందని, జీఎస్టీ అమలు మంచి ఫలితాలు ఇచ్చిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. జీఎస్టీ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తియైన సందర్భంగా మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్ హాలులో జరిగిన జి.ఎస్.టి దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. జి ఎస్.టి చెల్లించటం గౌరవప్రదంగా భావించాలని సూచించారు. దేశ పౌరులు, వ్యాపారస్తులు చెల్లించే వస్తుసేవల పన్ను దేశ నిర్మాణానికి, దేశ సౌభాగ్యానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో జీఎస్టీ ప్రారంభమైన ఏడాది రూ.2,850 కోట్లు ఆదాయం సమకూరగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.7,300 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అలాగే గుంటూరులో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రారంభంలో 19 వేల మంది ఉండగా, ఇప్పుడు 75 వేల మందికి చేరారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ జీఎస్టీతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎం.డి దాసరి రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ లో వచ్చిన సాంకేతిక సమస్యలు, సందేహాలు వీడాయన్నారు. సి.పి.డబ్లు.డి చీఫ్ ఇంజినీర్ ముక్కామల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ జీఎస్టీ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం అత్యధిక పన్ను చెల్లింపుదారులను సత్కరించి, మెమోంటోలు బహూకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేశారు.కార్యక్రమంలో జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ రెజ్వాని, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవి కుమార్, మరియదాసు సూపరింటెండెంట్లు ఆర్.పి.పి.కుమార్, యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి, సురేష్ మణి చిట్టెం వెంకటేశ్వరరావు, పూర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.