అక్రమార్జనకు దగ్గరిదారి | - | Sakshi
Sakshi News home page

అక్రమార్జనకు దగ్గరిదారి

Published Sun, Mar 23 2025 9:00 AM | Last Updated on Sun, Mar 23 2025 8:58 AM

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో కాంట్రాక్టర్లు, కొంతమంది మట్టి మాఫియా రాబందుల్లా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ ప్రతిరోజు రూ.లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి 5,6 కిలోమీటర్ల దూరంలోని కాజా టోల్‌గేట్‌ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణానికి మట్టి తవ్వి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్దంగా ఈ మట్టిని కొంతమంది వ్యాపారులకు లారీ రూ.2వేలకు అమ్ముతుంటే ఆ వ్యాపారులు లారీ రూ.7వేల నుంచి రూ.8 వేలకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఈ మట్టిని తరలించేందుకు మైనింగ్‌శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే సదరు కాంట్రాక్టర్‌ అవేవీ పట్టించుకోకుండా మట్టిని అమ్ముకోవడం ప్రారంభించారు. ఇదే అదునుగా తీసుకుని కొంతమంది అక్రమార్కులు సైతం రాజధాని ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన రోడ్లను సైతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.

పేదలకు ఇచ్చిన స్థలాల్లో సైతం..

గత ప్రభుత్వం పేదలకు నివాసాలుగా ఇచ్చిన స్థలాల్లో రోడ్లను సైతం కొన్ని చోట్ల తవ్వేశారు. రాత్రిళ్లు ఆ రహదారిపై మట్టిని తవ్వి ఒక ప్రాంతంలో డంపింగ్‌ చేసి ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాల విషయంలో ఈ మధ్యకాలంలో పలు కేసుల్లో నమోదైన ఓ వ్యక్తి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాలైన కృష్ణాయపాలెం శివారు, వెంకటపాలెం, మందడం శివారు ప్రాంతాల్లో, కొండవీటి వాగు రోడ్డుకు సంబంధించిన మట్టిని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు పెట్టి బయటకు తరలిస్తున్నారు. ఐదు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారు పొక్లెయిన్లు తీసుకువచ్చి వారంతట వారే హద్దులు నిర్వహించుకుని మట్టి తవ్వకాలు నిర్వహించి జేబులు నింపుకొంటున్నారు.

కనిపించని పర్యవేక్షణ

రాజధానిలో వివిధ పనులు నిర్వహించేందుకు వందలాది కంపెనీలు టెండర్లు దక్కించుకుని కాంట్రాక్ట్‌ వర్క్స్‌ చేస్తున్నాయి. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించడం లేదు. దాంతో సూపర్‌వైజర్స్‌గా వ్యవహరించే వారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలో సంపదను దోచుకుంటు జేబులు నింపుకొంటున్నారు. మట్టిని రాజధాని ప్రయోజనాలకు కాకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ, పోలీస్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

నిబంధనలకు నీళ్లు

రాజధానిలో రోడ్లను తవ్వేస్తూ

మట్టి అక్రమ విక్రయాలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

రాత్రిళ్లు ఐదు చోట్ల భారీ

యంత్రాలతో మట్టి లోడింగ్‌

జేబులు నింపుకొంటున్న వ్యాపారులు,

కాంట్రాక్టర్లు, వాహన యజమానులు

రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లు వదిలి తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం కాజాటోల్‌ వద్ద నుంచి గన్నవరం వరకు నిర్మించే రహదారిలో కాజా టోల్‌గేట్‌వద్ద నుంచి వెంకటపాలెం శివారు వరకు రోడ్డు నిర్మించేటప్పుడు తవ్వే మట్టిని నిబంధనలకు విరుద్దంగా అమ్ముకోవడమే. సదరు కాంట్రాక్టర్లు అవినీతికి దారి చూపడంతో కొంతమంది స్వార్ధపరులు రాజధానిలో నిర్మించిన రహదారులను సైతం తవ్వేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనులపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement