హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్‌కు లీగల్ షాక్ | Supreme Court Frowns Upon Karnataka HC Granting Bail To Actor Darshan | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. దర్శన్‌కు లీగల్ షాక్

Jul 17 2025 6:28 PM | Updated on Jul 17 2025 6:55 PM

Supreme Court Frowns Upon Karnataka HC Granting Bail To Actor Darshan

సాక్షి,న్యూఢిల్లీ: అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై గురువారం (జులై 17) సుప్రీంకోర్టు ఆగ్రహ వ్యక్తం చేసింది. రేణుకా స్వామి హత్యకేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు గతేడాది బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, దర్శన్‌కు బెయిల్‌ ఇచ్చే సమయంలో హైకోర్టు తగిన ఆధారాలు, కేసు తీవ్రత, బాధితుడి (రేణుకాస్వామి) హక్కులను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని భావించింది.

గతేడాది ఏప్రిల్‌ నెలలో తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్‌, పవిత్రగౌడ సహా 15మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం, గతేడాది డిసెంబర్‌లో వీరికి కర్ణాటక హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

దర్శన్‌కు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా..దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన తీరును తప్పుబట్టింది.

రేణుకాస్వామి హత్య కేసు విచారణ సందర్భంగా, దర్శన్ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇలా అన్నది.‘రేణుకాస్వామి కేసులో దర్శన్‌కు బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు తీర్పు.. న్యాయబద్ధంగా తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది. తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, విచక్షణను సరిగ్గా అమలు చేయలేకపోయింది అనిపిస్తోంది. మిస్టర్ సిబల్..మీ అభిప్రాయం ఏమిటి?’అని అడిగింది.

అందుకు కపిల్‌ సిబల్‌  అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి సాక్షుల ఇచ్చిన స్టేట్మెంట్‌లపై దృష్టి పెట్టాలని కోరారు.  కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తిపై సుప్రీం ధర్మాసనం.. విచారణ తదుపరి మంగళవారానికి వాయిదా వేస్తున్నాం. హైకోర్టు తీర్పులో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదో వచ్చే విచారణలో మీరు వాదించండి. మీ వాదనల్ని మేం వినాలని అనుకుంటున్నామని తెలిపింది.

 

Advertisement
 
Advertisement
Advertisement