అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి
నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారతరత్న అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్శియన్, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని.. ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటీష్ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎంఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.


