
హైస్పీడ్ రైల్వే లైన్లు!
సూర్యాపేట మీదుగా శంషాబాద్ – విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్కు కేంద్రం ఓకే
ఫ ఫైనల్ లొకేషన్ సర్వేకు నిధులు
ఫ డోర్నకల్ – గద్వాల కొత్త లైన్కు గ్రీన్ సిగ్నల్
ఫ కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు కేటాయింపు
ఫ రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన
ఫ నిధుల కేటాయింపు వివరాలను పింక్ బుక్లో వెల్లడించిన రైల్వే శాఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా రెండు రైల్వే లైన్లు రానున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ కింద శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర రైల్వే శాఖ ఓకే చెప్పింది. అలాగే సూర్యాపేట, నల్లగొండ మీదుగా డోర్నకల్ – గద్వాల లైన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే పనులకు నిధులను కేటాయించింది. రైల్వే బడ్జెట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులు, ఎఫ్ఎల్ఎస్లకు కేటాయించిన నిధుల వివరాలతో కూడిన పింక్ బుక్ను ఇటీవల విడుదల చేసింది.
కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు ఇలా..
● మాచర్ల నుంచి నల్లగొండ వరకు 92 కిలోమీటర్లు పొడవునా రూ.458.26 కోట్లతో కొత్త రైల్వే లైన్కు ఓకే చెప్పింది. దానికి సంబంధించిన సేఫ్టీ పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించింది.
● రూ.77.80 కోట్లతో విష్ణుపురం నుంచి జాన్పహాడ్ వరకు 11 కిలోమీటర్ల పొడవునా కొత్తలైన్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీనికి సేఫ్టీ ఫండ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించింది.
● జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు వరకు 19.1 కిలోమీటరు పొడవునా కొత్త లైన్కు ఓకే చెప్పింది. దాంతోపాటు మేళ్లచెరువు–జాన్పహాడ్ లైన్ 24 కిలోమీటర్ల పొడవునా ఆధునుకీకరణ పనులకు రూ.513.20 కోట్లు కేటాయించింది.
● ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వరకు 14.25 కిలోమీటర్ల పొడవునా 3, 4 లైన్ల డబ్లింగ్ చేసేందుకు ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ఇందుకు రూ.29 లక్షలు కేటాయించింది.
● భువనగిరి– బీబీనగర్ మధ్య 15 కిలోమీటర్ల పొడవునా 3వ లైన్ డబ్లింగ్కు ఎఫ్ఎల్ఎస్కు రూ.30 కోట్లు కేటాయించింది.
● ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ –2 విస్తరణకు ఓకే చెప్పింది. దీనికి వివిధ పద్దుల కింద రూ. 110 కోట్లు కేటాయించింది.
● అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను కేటాయించింది. అలాగే యాదాద్రిలో 4 కిలోమీటర్ల పొడవునా బైపాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది.
● గుంటూరు– బీబీనగర్ మధ్య డబ్లింగ్కు సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు రూ.3.10 కోట్లు, బీబీనగర్–భువనగిరి మధ్య డబ్లింగ్ కోసం ఎఫ్ఎల్ఎస్కు రూ.30 లక్షలు కేటాయించింది.
● గుంటూరు – బీబీనగర్ మధ్య రూ.2,853 కోట్లతో చేపట్టే డబ్లింగ్కు, రూ.110.89 కోట్లతో విష్ణుపురం వద్ద బైపాస్ లైన్ నిర్మాణానికి ఓకే చెప్పింది.
● మోతుమర్రి– విష్ణుపురం మధ్య డబ్లింగ్కు నిధులను కేటాయిచింది.
● రూ.3.32 కోట్లతో మిర్యాలగూడ గూడ్స్ షెడ్ను అభివృద్ధి చేయనుంది.
ఏళ్ల నాటి కల..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే, విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్ వరకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను చేపట్టింది. ఆ సర్వే గతేడాది చివరలో పూర్తి కావడంతో దానిని ఈ ఏడాది బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్తలైన్ ఎఫ్ఎల్ఎస్కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. దానికి రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది.

హైస్పీడ్ రైల్వే లైన్లు!